● భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్లు.. సాఫీగా దర్శనం
● 10 క్రైమ్ టీమ్స్తో నిఘా.. జూలై 31 నుంచి విధులు
● సీసీ కెమెరాలతో నిరంతర పర్యవేక్షణ
సికింద్రాబాద్, జూలై 25: ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షిత కృష్ణమూర్తి పేర్కొన్నారు. ఉత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన కోఆర్డినేషన్ సమావేశంలో భద్రతా ప్రణాళికను వివరించారు.
జోగినిలకు భాట నుంచి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. బోనాలతో వచ్చే మహిళల కోసం రెండు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఒకటి భాట నుంచి, మరొకటి పోచబజార్ వైపు నుంచి ప్రారంభమవుతుంది.
సాధారణ భక్తుల కోసం రెండు జనరల్ లైన్లు, పాస్లు కలిగిన వారి కోసం మరో రెండు ప్రత్యేక లైన్లు అందుబాటులో ఉంటాయి. రంగం కార్యక్రమం రోజున స్వర్ణలతకు ప్రత్యేక భద్రత కల్పించనున్నారు.
భక్తులు తక్కువ సమయంలో అమ్మవారి దర్శనం పూర్తి చేసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతలో భాగంగా 10 క్రైమ్ టీమ్స్ను రంగంలోకి దించుతున్నారు. ఈ బృందాలు జూలై 31 నుంచి విధుల్లో పాల్గొంటాయి.
అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని డీసీపీ పేర్కొన్నారు. వీఐపీల రాక సమయంలోనూ సాధారణ భక్తులకు ఆటంకం కలగకుండా దర్శన సదుపాయం కల్పిస్తారు.
“ఆలయ పరిసరాలపై సీసీ కెమెరాల ద్వారా పోలీస్ స్టేషన్ నుంచి నిరంతర నిఘా కొనసాగుతుందని రక్షిత కృష్ణమూర్తి స్పష్టం చేశారు.”
#Sidhumaroju










