మదనపల్లెలో గ్యాస్ లీకై ప్రమాదం: తల్లి, కూతురికి గాయాలు|

0
3

Madanapalle: మదనపల్లె మండలంలో గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగి తల్లి, కూతురు తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కొత్త ఇండ్లలో నివాసం ఉంటున్న లేట్ నాగ భార్య, ప్రత్యేక ప్రతిభావంతురాలు జ్యోతి (26) తన కుమార్తె లహరి (8)ను పాఠశాలకు పంపేందుకు సిద్ధం చేస్తోంది.

 

ఈ క్రమంలో కుమార్తెకు స్నానం చేయించేందుకు బాత్రూంకు తీసుకెళ్లి, గీజర్‌కు అమర్చిన గ్యాస్ సిలిండర్‌ను ఆన్ చేయగానే ఒక్కసారిగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి. అనూహ్యంగా మంటలు వ్యాపించడంతో తల్లి, కూతురు ఇద్దరూ మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, బాధితులను రక్షించారు. అనంతరం గాయపడిన జ్యోతి, లహరిని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.