● విద్యార్థిపై దాడి ఘటనలో ప్రిన్సిపాల్, వార్డెన్, హాస్టల్ ఇన్ఛార్జ్ అరెస్ట్
● ఘటనను తల్లిదండ్రులకు తెలియకుండా దాచే ప్రయత్నం.. ఆధారాల గోప్యతపై పోలీసుల దర్యాప్తు
● హాస్టళ్లలో 15 రోజుల బ్యాకప్తో సీసీ కెమెరాలు తప్పనిసరి.. యాజమాన్యాలకు పోలీసుల హెచ్చరిక
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 12: జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడ శ్రీచైతన్య టెక్నో స్కూల్ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఒక మైనర్ విద్యార్థిపై తోటి బాలురు పాత కక్షలతో దాడికి పాల్పడిన ఘటనలో పాఠశాల సిబ్బందిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.
మల్కాజ్గిరి డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో పోలీసులు ఈ కేసు వివరాలను వెల్లడించారు.ఆగస్టు 7, 8 తేదీల మధ్య రాత్రి జరిగిన ఈ ఘోర దాడిలో సదరు విద్యార్థి శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడి తండ్రి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదుతో ఈ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది.
అయితే విద్యార్థిపై తోటి బాలురు క్రూరంగా దాడి చేసిన విషయాన్ని తల్లిదండ్రులకు తెలియకుండా పాఠశాల యాజమాన్యం దాటవేసే ప్రయత్నం చేసింది. అతడు మెట్లపై నుంచి కిందపడటంతోనే గాయాలయ్యాయని నమ్మబలికినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఘటనకు సంబంధించిన వాస్తవాలను దాచడంతో పాటు, ఆధారాలను మరుగునపరిచేందుకు, నిందితులను కాపాడేందుకు యాజమాన్యం ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి, సాక్ష్యాలను దాచేందుకు ప్రయత్నించిన పాఠశాల ప్రిన్సిపాల్ జన్మంచి మనోజ్ కుమార్, హాస్టల్ వార్డెన్ మొకేపల్లి బాబు, హాస్టల్ ఇన్ఛార్జ్ జాతోత్ ఆకాష్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
దాడికి పాల్పడిన మైనర్ బాలురపై కూడా జువైనల్ చట్ట ప్రకారం చర్యలు కొనసాగుతున్నాయి. మల్కాజ్గిరి జోన్ డీసీపీ CH. శ్రీధర్, IPS పర్యవేక్షణలో జవహర్నగర్ ఏసీపీ S. చక్రపాణి ఈ కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
విద్యాసంస్థలు, హాస్టళ్లలో పిల్లల భద్రతకు సంబంధిత యాజమాన్యాలే పూర్తి బాధ్యత వహించాలని పోలీసులు స్పష్టం చేశారు. ప్రతీ హాస్టల్లో కనీసం 15 రోజుల బ్యాకప్ ఉండేలా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పాఠశాలలు, హాస్టళ్లలో విద్యార్థులకు సంబంధించిన అవాంఛనీయ ఘటనలను దాచిపెట్టడం, సాక్ష్యాలను చెరిపివేయడం లేదా బాధ్యులను కాపాడేందుకు ప్రయత్నిస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని, కఠినమైన క్రిమినల్ చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
#Sidhumaroju
Alwal










