● నాగారం మున్సిపాలిటీలో బస్తీలు, కాలనీల్లో పర్యటించిన ఈటల రాజేందర్
● డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్, బోర్వెల్ సమస్యలపై పరిశీలన
● ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న మల్కాజిగిరి ఎంపీ
మేడ్చల్ మల్కాజిగిరి, ఆగస్టు 19: ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడమే లక్ష్యంగా మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజల కోసం తాను సెలవులు తీసుకోనని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ఈటల రాజేందర్ తరచూ పేర్కొంటుంటారు. ఇందులో భాగంగా షామీర్పేటలోని తన నివాసంలో ప్రతిరోజూ ఉదయం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు.
ప్రజల వద్దకే పాలన అన్న విధంగా ప్రస్తుతం బస్తీలు, కాలనీల్లో పర్యటిస్తూ స్థానికుల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో బుధవారం మేడ్చల్ నియోజకవర్గంలోని నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఈటల రాజేందర్ పర్యటించి పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలను పరిశీలించారు.
నేతాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్కు బోర్వెల్ ఏర్పాటు చేయాలని స్థానికులు ఈటల రాజేందర్ను కోరారు. చండీశ్వర నగర్లో డ్రైనేజీ, కాలుష్య సమస్యలను పరిశీలించారు. సాయికృష్ణ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్లు, విద్యుత్ సమస్యలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. శ్రీరామ్ నగర్ కాలనీలో డ్రైనేజీ, సీసీ రోడ్ల సమస్యలను పరిశీలించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ స్వామి, శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ పర్యటనలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు ఏను సుదర్శన్ రెడ్డి, నాగారం మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి, నాగారం బీజేపీ అధ్యక్షుడు నాగరాజ్, సీనియర్ నాయకులు శ్రీనివాస్, వెంకటేశ్వరరావు, సతీష్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










