మదనపల్లె: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 2వ తేదీన మదనపల్లెలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించనున్నట్లు రాయలసీమ కో-కన్వీనర్, మదనపల్లె నియోజకవర్గ ఇన్చార్జ్ గంగారపు రాందాస్ చౌదరి తెలిపారు.
ఆయన అధ్యక్షతన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, మెగా అభిమానుల ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకల్లో భాగంగా ఉదయం 9 గంటలకు మిషన్ కాంపౌండ్ నుంచి భారీ బైక్ ర్యాలీ ప్రారంభమై చిత్తూరు బస్టాండ్, టౌన్ బ్యాంక్ సర్కిల్, బెంగళూరు బస్టాండ్, ఎన్టీఆర్ సర్కిల్, నీరుగట్టువారిపల్లె మీదుగా శ్రీదేవి గార్డెన్ వరకు కొనసాగనుంది.
బైక్ ర్యాలీలో పాల్గొనే వారు ఉదయం 8.30 గంటలకే మిషన్ కాంపౌండ్ వద్దకు చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. అనంతరం ఉదయం 11 గంటలకు శ్రీదేవి గార్డెన్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే లైవ్ కార్యక్రమాన్ని ఎల్ఈడీ స్క్రీన్పై ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా యువజన విభాగానికి సంబంధించిన ప్రకటన, పవన్ కళ్యాణ్ సందేశం, ఇతర ఆనంద క్షణాలను పార్టీ శ్రేణులు, అభిమానులు కలిసి వీక్షించనున్నారు.










