బొల్లారం ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ.|

0
26

● అత్యంత భద్రత మధ్య 12 ఆయుధాలు మాయం

● ఆదివారం రాత్రి చోరీ.. సోమవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు

● అంతర్గత వ్యక్తుల ప్రమేయంపై అనుమానాలు

ఆల్వాల్, సెప్టెంబర్ 1: సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ క్యాంపులో భారీ ఆయుధాల చోరీ కలకలం రేపింది.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆయుధాల గదిలోకి చొరబడిన గుర్తుతెలియని వ్యక్తులు తాళం పగులగొట్టి 12 ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు అధికారులు గుర్తించారు.

ఆదివారం రాత్రి ఈ చోరీ జరిగినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. అనంతరం సోమవారం ఉదయం బొల్లారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్మీ అధికారుల ఫిర్యాదు మేరకు బొల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రక్షణ వ్యవహారాలకు సంబంధించిన సున్నితమైన కేసు కావడంతో పోలీసులు దర్యాప్తు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు.

ప్రాథమిక వివరాల ప్రకారం నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక INSAS రైఫిల్‌తో పాటు మందుగుండు సామగ్రి చోరీకి గురైనట్లు గుర్తించారు. ఆయుధాల గది వరకు చేరుకుని తాళం పగులగొట్టి చోరీ చేయడం ఇప్పుడు తీవ్ర భద్రతా ప్రశ్నలను లేవనెత్తుతోంది.

మద్రాస్ రెజిమెంట్‌లోకి అనుమతి ఉన్న సైనికులు, సిబ్బంది, ఇతర అధికారిక వ్యక్తులకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. బయట వ్యక్తుల ప్రవేశం అత్యంత పరిమితంగా ఉండటంతో చోరీ వెనుక అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న కోణంలో పోలీసులు, ఆర్మీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

చోరీకి గురైన ఆయుధాల బరువు, పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు ఒక్క వ్యక్తి ఈ చోరీకి పాల్పడటం కష్టమని భావిస్తున్నారు. కనీసం ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది ఇందులో పాల్గొని ఉండొచ్చనే కోణంలోనూ విచారణ సాగుతోంది.

మద్రాస్ రెజిమెంట్ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీ జరిగిన సమయంలో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది, ఆయుధాల గదికి ప్రవేశం ఉన్న వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు, వాహనాల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు.

మరోవైపు ఆర్మీ అధికారులు తమ పరిధిలో సిబ్బందిని అంతర్గతంగా విచారిస్తున్నారు.

అత్యంత భద్రత కలిగిన ఆర్మీ ప్రాంగణంలో కీలకమైన ఆయుధాలు చోరీకి గురికావడంతో ఈ ఘటనపై మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరు, ఆయుధాలను ఎక్కడికి తరలించారు, ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

#sidhumaroju

Alwal