● నలుగురు నిందితుల అరెస్ట్.. ప్రమాదకర ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, బైనాక్యులర్ స్వాధీనం
● లోపలి వ్యక్తుల సహకారంతోనే చోరీ.. మల్లేశ్ ప్రధాన నిందితుడిగా గుర్తింపు
● అంతర్జాతీయ ముఠాలు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు లేవు
అల్వాల్, సెప్టెంబర్ 11: సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని బొల్లారం మద్రాస్ రెజిమెంట్కు చెందిన ఆయుధాల చోరీ కేసును తెలంగాణ పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. చోరీకి గురైన ఆయుధాలు, మ్యాగజైన్లు, బుల్లెట్లు, నైట్ విజన్ బైనాక్యులర్ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేసుకు సంబంధించిన కీలక వివరాలను డీజీపీ వెల్లడించారు.
● ఆగస్టు 31న వెలుగులోకి..
బొల్లారంలోని 20 మద్రాస్ రెజిమెంట్కు చెందిన ‘బెల్ ఆఫ్ ఆర్మ్స్’లో ఆయుధాల చోరీ ఆగస్టు 31న వెలుగులోకి వచ్చింది. ఆర్మరీలో ఆయుధాల లెక్కింపు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సమయంలో తాళాలు, తలుపులు దెబ్బతిన్నట్లు గుర్తించి చోరీ జరిగిన విషయం బయటపడింది. అంతకుముందు ఆగస్టు 30న సాయంత్రం ఆయుధాలను పరిశీలించినప్పుడు అన్నీ సక్రమంగానే ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
● 16 మందిపై తొలి దృష్టి..
ఆయుధాల గదికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రవేశించే అవకాశం ఉన్న 16 మందిని పోలీసులు మొదట విచారించారు. వారి కదలికలు, విధులు, ఆయుధాల విభాగానికి ఉన్న యాక్సెస్తో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. ఈ క్రమంలో హవాల్దార్లు టీపీఎస్ రావు, మల్లేశ్ అలియాస్ రాజుపై అనుమానాలు బలపడ్డాయి.
● రెండు రోజుల ముందే రెక్కీ..
డీజీపీ వివరాల ప్రకారం.. మల్లేశ్ ఆగస్టు 28, 29 తేదీల్లో రెజిమెంట్ పరిసరాల్లో రెక్కీ నిర్వహించాడు. రాత్రి సమయంలో సీసీ కెమెరాల నిఘా తక్కువగా ఉన్న మార్గాలను గుర్తించినట్లు దర్యాప్తులో తేలింది. ఆగస్టు 30న రాత్రి కర్గిల్ గేట్ నుంచి రెజిమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించి, ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆగస్టు 31న ఆయుధాలను చోరీ చేసినట్లు పోలీసులు గుర్తించారు.
● సాంకేతిక ఆధారాలతో గుట్టురట్టు..
మల్లేశ్ను విచారించిన సమయంలో తొలుత పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే సాంకేతిక ఆధారాలు, ఫోన్ కాల్స్, ఇతర వివరాలను పరిశీలించడంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. తన భార్యకు విషయం చెప్పడంతో పోలీసులు ఆమెను కూడా ప్రశ్నించారు. దీంతో మల్లేశ్ చోరీకి సంబంధించిన విషయాలను అంగీకరించినట్లు డీజీపీ వెల్లడించారు.
● తొలుత ఒకచోట పాతిపెట్టి..
చోరీ చేసిన ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మల్లేశ్ తొలుత ఒక ప్రాంతంలో పాతిపెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం వాటిని మరో ప్రాంతానికి తరలించినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలు ఎందుకు ఒకచోట నుంచి మరోచోటికి తరలించాల్సి వచ్చింది? ఈ వ్యవహారంలో మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోంది. తాజా పోలీసు వివరాల ప్రకారం ఆయుధాలు కౌకూర్, యాప్రాల్, అచ్చంపేట ప్రాంతాల్లో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
● ఆర్మీ నుంచి తొలగించారన్న కోపంతోనే?
ప్రాథమిక దర్యాప్తులో మల్లేశ్ ఆర్మీ నుంచి తనను ఎలాంటి కారణం లేకుండా తొలగించారన్న కోపంతో ఈ చోరీకి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే ఇదే తుది ఉద్దేశమా? లేక మరేదైనా కారణం ఉందా? అనే అంశాన్ని దర్యాప్తు బృందాలు పరిశీలిస్తున్నాయి. మల్లేశ్ ఆర్మీలో హవాల్దర్గా పనిచేసి 2026 జూన్ 30న రిటైర్ అయినట్లు తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.
● బెల్ ఆఫ్ ఆర్మ్స్ విభాగంలోనే కీలక సహకారం?
ఆయుధాల చోరీలో బెల్ ఆఫ్ ఆర్మ్స్ ఇన్చార్జి, బుల్లెట్ల విభాగం ఇన్చార్జి సహకారం ఉన్నట్లు దర్యాప్తులో తేలిందని డీజీపీ తెలిపారు. ఆయుధాల నిల్వ, భద్రతా విధానాలు, ప్రవేశ మార్గాలపై అవగాహన ఉన్నవారికి ఈ చోరీలో కీలక పాత్ర ఉండే అవకాశం ఉందని దర్యాప్తు బృందాలు పరిశీలించాయి.
● ఇన్సైడ్ జాబ్గా నిర్ధారణ..
తొలిదశలోనే ఈ ఘటనలో అంతర్గత వ్యక్తుల ప్రమేయం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆర్మరీకి పరిమిత వ్యక్తులకే ప్రవేశం ఉండటం, రాత్రివేళ నిఘా పరిస్థితులు, ఆయుధాల నిల్వపై అవగాహన వంటి అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకెళ్లారు. చివరకు మాజీ ఆర్మీ హవాల్దర్ మల్లేశ్ కీలక నిందితుడిగా బయటపడటంతో ఇది ఇన్సైడ్ జాబ్ అనే కోణం బలపడింది.
● ఉగ్రవాద సంబంధాలపై ఆధారాలు లేవు..
ఈ ఘటన వెనుక అంతర్జాతీయ ఆయుధ ముఠాలు లేదా ఉగ్రవాద సంస్థల ప్రమేయానికి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. దీంతో ఆయుధాలు ఉగ్రవాద కార్యకలాపాలకు తరలించారన్న అనుమానాలకు ప్రస్తుత దర్యాప్తులో ఆధారం లేదని పోలీసులు చెబుతున్నారు.
● నలుగురు అరెస్ట్.. దర్యాప్తు కొనసాగింపు
కేసులో మొత్తం నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు డీజీపీ ప్రకటించారు. అయితే మిగిలిన నిందితుల పూర్తి పాత్ర, ఆయుధాల చోరీలో వారి ప్రమేయం, ఆయుధాలను తరలించడంలో ఎవరెవరు సహకరించారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ప్రధాన నిందితుడిగా గుర్తించిన మల్లేశ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
● దర్యాప్తు బృందాలకు డీజీపీ అభినందనలు..
సున్నితమైన ఆయుధాల చోరీ కేసును సవాలుగా తీసుకుని ఛేదించిన పోలీసు, ఆర్మీ అధికారులు, దర్యాప్తు బృందాలను డీజీపీ సీవీ ఆనంద్ అభినందించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ సజ్జనార్తో పాటు కేసు దర్యాప్తులో భాగమైన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేశారని తెలిపారు.
ఆయుధాల చోరీ వెనుక అసలు ఉద్దేశం, నిందితుల మధ్య పూర్తి సంబంధాలు, ఆయుధాల తరలింపులో మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నందున కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.










