🎤భారత్ ఆవాజ్ న్యూస్ (కుమ్రం భీం ఆసిఫాబాద్): కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీమతి నితికా పంత్, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో లింగాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జముల్దారా గ్రామంలో ప్రజలకు విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ కళాబృందం సభ్యులు తమ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా సమాజంలో జరుగుతున్న పలు ప్రధానాంశాలపై గ్రామీణులకు చైతన్యం కల్పించారు. ముఖ్యంగా గంజాయి సాగు మరియు వినియోగం వల్ల కలిగే నష్టాలు, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, బాల్య వివాహాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలు & రోడ్డు భద్రత, నూతన చట్టాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారు. వీటితో పాటు గ్రామాల్లో భద్రత కోసం సీసీ కెమెరాల ఆవశ్యకతను వివరిస్తూనే, మూఢనమ్మకాలు మరియు సామాజిక మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నెంబర్కు ఫిర్యాదు చేయాలని, అలాగే ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా 112 నెంబర్కు కాల్ చేసి పోలీసుల సహాయం పొందాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో లింగాపూర్ ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది, మరియు జిల్లా పోలీస్ కళాబృందం సభ్యులు రాంచెందర్, రోహిత్, చంద్రశేఖర్, శ్రీనివాస్, రజిత, సంఘువి తదితరులు పాల్గొన్నారు.










