భూపాలపల్లి: జిల్లా కలెక్టర్ రాహుల్శర్మ బుధవారం భూపాలపల్లి మండలం కొంపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రీ-ప్రైమరీ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు అందుతున్న విద్య, మౌలిక సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ వసతులపై పరిశీలన నిర్వహించారు. ఉపాధ్యాయులు వేసవి సెలవుల్లో విద్యార్థుల ప్రవేశాలను 50 శాతం పెంచడంతో కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. కలెక్టర్ పదో తరగతి విద్యార్థులతో భవిష్యత్తు లక్ష్యాల గురించి ముఖాముఖిగా మాట్లాడి, వారు ఐఏఎస్, ఐపీఎస్, వైద్యులు, ఇంజనీర్లు కావాలని చెప్పడం గమనించారు. ప్రీ-ప్రైమరీ పాఠశాలలో చిన్నారులకు అందుతున్న వాతావరణం, అభ్యాస పద్ధతులు, మధ్యాహ్న భోజనం, మోడల్ మరుగుదొడ్లు పరిశీలించి ఉపాధ్యాయులకు నాణ్యమైన విద్య అందించాలని సూచించారు. పాఠశాల ఆవరణలో మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహమిచ్చారు. కార్యక్రమంలో డీఈఓ లలిత, సర్పంచ్ శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.