పారిశుద్ధ్య ఇంజనీరింగ్ పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించాలి

0
0

పారిశుద్ధ్య, ఇంజనీరింగ్, పార్కు కార్మికులకు తక్షణమే జీతాలు చెల్లించండి.
రేపటిలోగా జీతాలు చెల్లించని పక్షంలో పని బంద్
విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ధర్నా

 

పారిశుధ్య, ఇంజనీరింగ్, పార్కు ఔట్సోర్సింగ్ కార్మికుల జీతాలు తక్షణమే చెల్లించాలని విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం పాత బస్తి, నగరపాలక సంస్థ సర్కిల్ వన్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కె ఆర్ ఆంజనేయులు మాట్లాడుతూ ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, నిత్యవసరాలను చెల్లించుకోవాలంటే జీతాల మీద ఆధారపడి జీవించే పారిశుధ్య కార్మికులు సకాలంలో జీతాలు రాక చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కనీస వేతనం అమలు చేయకుండానే అరకొర జీతాలతో పనిచేస్తున్న వీరికి ఇవ్వవలసిన జీతాలు కూడా సక్రమంగా చెల్లించకపోతే ఎలా జీవించగలరో ఆలోచించాలని కోరారు.

అనంతరం యూనియన్ నగర ప్రధాన కార్యదర్శి బుద్దె రాజా మాట్లాడుతూ ఐదు నిమిషాలు సమయం లేట్ అయినా ఆరోజు విధులలోకి తీసుకొని నిబంధనలతో పనులు చేయించుకుంటున్నారు కానీ జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించటం లేదని విమర్శించారు. 20వ తారీకు వచ్చిన ఇంకా నెల జీతం రాకపోవటంతో కార్మికులు అప్పులు చేసుకుని జీవనం సాగిస్తున్నారని అన్నారు.

అనంతరం యూనియన్ అధ్యక్షులు ఎస్వీఎస్ చలం, గౌరవ అధ్యక్షులు జక్కి జేమ్స్, కోశాధికారి తుపాకుల నాగేశ్వరరావు ప్రసంగిస్తూ రేపటిలోగా జీతాలు చెల్లించని పక్షంలో పని బంద్ పాటించాల్సి వస్తుందని హెచ్చరించారు.

ధర్నా అనంతరం అసిస్టెంట్ కమిషనర్ శర్మ కి వినతి పత్రం సమర్పించడం జరిగింది.

కార్యక్రమములో యూనియన్ నాయకులు కొండా వెంకటేశ్వర్లు, వరికుప్పల రామకృష్ణ, నీలమ్మ, నిమ్మ తోట భారతి, పోలవరపు రమణ, పోలవరపు మణి తదితరులు పాల్గొన్నారు.