సికింద్రాబాద్ : తొంభై ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన ఆర్టీసీ మనుగడకు కాంగ్రెస్ ప్రభుత్వం ముప్పు తలపెడుతోందని బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాణిగంజ్ డిపో వద్ద ఆందోళన చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల ధర్నాలో పాల్గొని ఆయన తన పూర్తి మద్దతు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని, ఎవడబ్బ జాగీరు అని డిపోలను ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేస్తారని నిలదీశారు.
ఎలక్ట్రిక్ బస్సులను తీసుకువచ్చి ఆర్టీసీ ఉద్యోగులను రోడ్డున పడేయాలని ప్రభుత్వం చూస్తోందని, ఆ బస్సులను కూడా సంస్థ డ్రైవర్లు, కండక్టర్లతోనే నడిపించాలని ఆయన డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీలనే అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని, దీన్ని బిఆర్ఎస్ ప్రోద్బలంగా చిత్రీకరించడం మంత్రుల అవివేకమని తలసాని విమర్శించారు.
సురక్షిత ప్రయాణానికి మారుపేరుగా నిలిచిన ఆర్టీసీ అభివృద్ధిలో కార్మికుల శ్రమ వెలకట్టలేనిదని, ముఖ్యంగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో వారి పాత్ర ఎంతో గొప్పదని గుర్తు చేశారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో వారికి అండగా ఉండి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
#sidhumaroju









