“సబ్బండ వర్గాల గళం.. ఇక మండలిలో సాగదు విరామం: ఎమ్మెల్సీగా కోదండరాం!

0
1

హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం. కోదండరాంరెడ్డి నేడు గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు.

హైదరాబాద్‌లోని శాసనమండలి ప్రాంగణంలో జరిగిన ఈ అధికారిక కార్యక్రమంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.

మలిదశ తెలంగాణ ఉద్యమంలో జేఏసీ చైర్మన్‌గా యావత్ రాష్ట్రాన్ని ఏకం చేసి, ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరాంకు ఈ పదవి దక్కడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన చిక్కులకు ఇటీవల కోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ప్రభుత్వం ఈ నియామకాన్ని పూర్తి చేసింది.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొని కోదండరాంకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

విద్యావేత్తగా, సామాజిక కార్యకర్తగా దశాబ్దాల అనుభవం ఉన్న కోదండరాం చట్టసభలోకి అడుగుపెట్టడం వల్ల మండలిలో ప్రజా సమస్యలపై లోతైన చర్చలు జరుగుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

చట్టసభ వేదికగా ప్రజల పక్షాన తన గళం వినిపిస్తానని, రాష్ట్ర అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు.

#sidhumaroju