చీరాల
చీరాల పట్టణంలోని 29వ వార్డు హరిప్రసాద్ నగర్లో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 63వ ఆరాధన మహోత్సవాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. దేవస్థానం కమిటీ సభ్యులు, దాతల సహకారంతో ఈ వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో కళ్యాణోత్సవం
ఉత్సవాల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ అన్నదాన కార్యక్రమంలో సుమారు 3000 మంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల రాకతో హరిప్రసాద్ నగర్ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. గత 63 సంవత్సరాలుగా కృష్ణబలిజ సంగీయుల ఆధ్వర్యంలో ఈ ఆరాధన కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామివారి జెండాను పురవీధుల్లో ఊరేగించారు. భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పిస్తూ నిర్వహించిన ఈ ఊరేగింపులో స్థానిక ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దాతల సహకారంతో ఏటేటా ఈ ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తున్నామని దేవస్థానం కమిటీ,నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు.









