రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

0
1

మంచిర్యాల జిల్లా | మే 8 అకాల వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో రైతులు మృతి చెందిన ప్రాంతాలను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరిశీలించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, లక్షెట్‌పేట్ తహసిల్దార్ దిలీప్ కుమార్, డీసీసీ ప్రతినిధి రఘునాథ్ రెడ్డి మరియు అధికారులతో కలిసి ఘటనాస్థలాలను సందర్శించారు.

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తోందని తెలిపారు. లక్షెట్‌పేట్ మండలం కొత్తూరు కొనుగోలు కేంద్రంలో గోడ కూలి రైతులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. రవాణా సమస్యల వల్ల రైతులు ఇబ్బంది పడకూడదని, లారీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. కొత్తూరు కొనుగోలు కేంద్రానికి సంబంధించిన ధాన్యాన్ని నెల్కి వెంకటాపూర్ గోదాముకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అకాల వర్షాల ప్రమాదంలో మృతి చెందిన కొత్తూరు గ్రామానికి చెందిన వెంకటేష్ కుటుంబాన్ని, గంపలపల్లి గ్రామానికి చెందిన తండ్రి–కొడుకులు తనుగుల నాగరాజు, అభిరామ్ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబాన్ని జిల్లా కలెక్టర్ మరియు తహసిల్దార్ రోహిత్ దేశ్‌పాండేతో కలిసి పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.