*కోర్టు కేసులపై నిరంతర సమీక్ష అవసరం*
*విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర*
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన ఛాంబర్లో శాఖాధిపతులతోవివిధ కోర్టు కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల స్థితిగతులు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలు, కోర్టు ఆదేశాల అమలు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రతి కోర్టు కేసును సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, కేసుల పురోగతిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కోర్టు ఆదేశాలను సమయానికి అమలు చేయడం ప్రతి అధికారి బాధ్యత అని పేర్కొన్నారు. కోర్టు కేసుల విషయంలో నిర్లక్ష్యం వహించకుండా, శాఖల మధ్య సమన్వయంతో వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అదేవిధంగా, వివిధ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన అంశాల్లో అవసరమైన పత్రాలు, నివేదికలు మరియు సమాచారాన్ని సిద్ధం చేసి న్యాయవాదులకు అందజేయాలని సూచించారు. కోర్టు కేసుల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో అదనపు కమిషనర్లు డాక్టర్ డి. చంద్రశేఖర్, ఎ. రవీంద్రరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ ఇంచార్జ్ పి. సత్యకుమారి, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యూసీడీ) ఎం. విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి. సృజన, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ డి.హరీష్, తదితరులు పాల్గొన్నారు.










