“ప్రధాని మోదీ సభకు హైదరాబాద్ హై అలర్ట్.. పరేడ్ గ్రౌండ్స్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత”

0
3

హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో మే 10, 2026 సాయంత్రం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వద్ద జరగనున్న భారీ బహిరంగ సభకు నగర పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.

దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పరంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టినట్లు మల్కాజ్‌గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి బి.సుమతి IPS వెల్లడించారు.

సభ ప్రాంగణం నుంచి ప్రధాన రహదారులు, పార్కింగ్ ప్రదేశాలు, కీలక జంక్షన్ల వరకు అన్ని ప్రాంతాలను సీసీ కెమెరాల నిఘాలో ఉంచిన పోలీసులు, బహుళస్థాయి యాంటీ సబోటేజ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మొత్తం 2000 మంది లా అండ్ ఆర్డర్ సిబ్బంది, 620 మంది ట్రాఫిక్ పోలీసులతో పాటు OCTOPUS, SOT, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌లు, డాగ్ స్క్వాడ్‌లు, ఇంటెలిజెన్స్ బృందాలు రంగంలోకి దిగి భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

సభకు వచ్చే ప్రజలను కేవలం నిర్ణీత గేట్ల ద్వారానే అనుమతిస్తామని, ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఫ్రిస్కింగ్, స్క్రీనింగ్ నిర్వహిస్తామని పోలీసులు స్పష్టం చేశారు. డ్రోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, బ్యాగులు, నీటి బాటిళ్లు, బ్యానర్లు, వెలుపల ఆహార పదార్థాలు, పదునైన వస్తువులు వంటి నిషేధిత వస్తువులను తీసుకురావొద్దని హెచ్చరించారు.

మే 10 అర్ధరాత్రి నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ల ఎగురవేతపై పూర్తి నిషేధం విధించారు.

ప్రధానమంత్రి కాన్వాయ్ రాకపోకల దృష్ట్యా బేగంపేట్ , పారడైస్ , పాట్నీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.

సభ ప్రాంగణానికి సమీపంలో వాహనాలకు అనుమతి ఉండదని, ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ ప్రాంతాల్లోనే వాహనాలు నిలిపివేయాలని సూచించారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే బస్సులు ఉప్పల్ స్టేడియం పార్కింగ్ వద్ద నిలిపి, అక్కడి నుంచి మెట్రో రైళ్ల ద్వారా పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకోవాలని సూచించారు.

సభ సందర్భంగా వైద్య సేవలు, ఫైర్ సేఫ్టీ, అత్యవసర సహాయక చర్యలు కూడా సిద్ధంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు తమ విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

భద్రతా నిబంధనలు ఉల్లంఘించినా, సభకు అంతరాయం కలిగించినా కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

#Sidhumaroju