“బండి భగీరథ్ కేసులో SIT దర్యాప్తు.. రాజకీయాలు, మీడియా తీరు చుట్టూ కొనసాగుతున్న చర్చ.|

0
12

హైదరాబాద్ : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి భగీరథ్‌కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్న వేళ, ఈ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

కేసును సమగ్రంగా విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది.

మైనర్ బాలికకు సంబంధించిన వ్యవహారంలో బండి భగీరథ్ పేరు బయటకు రావడంతో మొదట సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభమైంది. అనంతరం కేసు నమోదు కావడం, రాజకీయ ఆరోపణలు వెల్లువెత్తడం, జాతీయ స్థాయిలో చర్చ జరగడం వంటి పరిణామాలతో వ్యవహారం మరింత సంచలనంగా మారింది.

విపక్ష పార్టీలు ఈ అంశంపై బీజేపీని టార్గెట్ చేస్తుండగా, బీజేపీ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ కక్షసాధింపేనని ఆరోపిస్తోంది.

ఈ వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు N. రాంచందర్ రావు , ఇది పూర్తిగా వ్యక్తిగత అంశమని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియలో భాగంగా ఫిర్యాదులు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు.

మరోవైపు బీజేపీ వర్గాలు కూడా కేవలం ఆరోపణలు వచ్చాయని మాత్రమే ముందుగానే తీర్పులు ఇవ్వడం సరికాదని వాదిస్తున్నాయి.

భారత న్యాయవ్యవస్థ ప్రకారం కోర్టు తుది తీర్పు ఇవ్వకముందు ఎవరినీ నేరస్థుడిగా ప్రకటించలేరు. ఫిర్యాదు నమోదు కావడం, కేసు నమోదు కావడం, దర్యాప్తు జరగడం అనేవి చట్టపరమైన ప్రక్రియలో భాగమే.

అయితే సోషల్ మీడియా, కొన్ని రాజకీయ వర్గాలు, కొంత మీడియా మాత్రం ప్రారంభ దశలోనే తీర్పులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధి కుటుంబానికి సంబంధించిన అంశంలో మర్యాదపూర్వక భాష వాడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. “వాడు, వీడు” వంటి పదజాలంతో సంభోదించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని, మీడియా విచారణాధికారి కాదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

ప్రజలకు సమాచారం అందించడం మీడియా బాధ్యతే అయినప్పటికీ, దర్యాప్తు పూర్తికాకముందే వ్యక్తిత్వ హననం జరిగేలా కథనాలు రావడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని మీడియా పరిశీలకులు చెబుతున్నారు.

ఇప్పటికే ఈ కేసు రాజకీయంగా హైప్రొఫైల్‌గా మారడంతో దర్యాప్తుపై ఎటువంటి అనుమానాలు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతోనే SIT ఏర్పాటు చేసినట్లు భావిస్తున్నారు.

డిజిటల్ సాక్ష్యాలు, వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఆధారాలు ఈ కేసులో కీలకంగా మారనున్నాయి.

ప్రస్తుతం అసలు ఘటన ఎలా జరిగింది, ఇందులో రాజకీయ కోణం ఉందా లేదా అన్న ప్రశ్నలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. SIT దర్యాప్తు పూర్తయ్యాకే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

#sidhumaroju