మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంగాపురం కాలనీ పార్క్లో సోమవారం సాయంత్రం “మీ సురక్ష” యాప్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఎస్హెచ్వో ప్రశాంత్ మరియు సెక్టార్ ఎస్ఐ రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ నివాసితులకు “మీ సురక్ష” యాప్ వినియోగంపై వివరంగా అవగాహన కల్పించారు.
ముఖ్యంగా పొరుగువారి వివరాలు, సీనియర్ సిటిజన్లు, గృహ సేవకులు, వాచ్మెన్లు, డ్రైవర్లు, కేర్టేకర్లు, హోమ్ నర్సులు, అద్దెదారులు తదితరుల సమాచారాన్ని యాప్లో నమోదు చేయాలని సూచించారు. ఈ వివరాలు నేరాల నివారణకు, అలాగే అనుకోని ఘటనలు జరిగినప్పుడు పోలీసుల దర్యాప్తుకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.
ప్రజల సహకారంతో సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమవుతుందని తెలిపారు.
ఇక సైబర్ నేరాలపై కూడా అవగాహన కల్పించారు. ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ మోసాలు, ఓటీపీ ఫ్రాడ్లు, ఫేక్ కస్టమర్ కేర్ కాల్స్, సోషల్ మీడియా హ్యాకింగ్, యూపీఐ మోసాలు, అనుమానాస్పద లింకులు మరియు APK ఫైళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీలు, బ్యాంక్ వివరాలు, పాస్వర్డ్లు ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే 1930 హెల్ప్లైన్ లేదా నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని తెలిపారు.
అదేవిధంగా ఇళ్ల చోరీలు, దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారం వంటి ఆస్తి సంబంధిత నేరాల నివారణపై సూచనలు ఇచ్చారు. ప్రతి ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం, గృహ సేవకులు మరియు అద్దెదారుల వివరాలను ధృవీకరించడం, ప్రయాణాల సమయంలో ఇళ్లను భద్రంగా ఉంచుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ట్రాఫిక్ భద్రతపై కూడా అవగాహన కల్పించారు. హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్లు ఉపయోగించవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని తల్లిదండ్రులకు ప్రత్యేకంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో మంగాపురం కాలనీ నివాసితులు ఉత్సాహంగా పాల్గొని, ప్రజా భద్రత కోసం పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలను అభినందించారు.
#Sidhumaroju
Alwal










