గత నెల రోజులుగా మూతపడ్డ మినీ ట్యాంక్ బండ్…
మీడియాలో సోషల్ మీడియాలో వార్తలు వచ్చినప్పటికీ స్పందిచని ఎమ్మెల్యే ధన్పాల్..ఈరోజు ఆందోళన చేయాలని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యం లో BRS నాయకులు మినీ ట్యాంక్ బండ్ చేరుకున్నారు.ముందే విషయం తెలుసుకున్న ధన్పాల్ పరువు పోతుందని గ్రహించి ఆగమేఘాలపై గేట్లను తెరిపించారు.మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి చూస్తే నిజామాబాద్ అభివృద్ధిపై ధన్పాల్ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది…దన్పాల్ తన ట్రస్టు ద్వారా అభివృద్ధి చేస్తా అన్నావ్ ఏమైంది…నైతిక బాధ్యత వహిస్తూ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రాజీనామా చేయాలి..నిజామాబాద్ నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు BRS ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్ బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉండటం, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత మరియు స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల మండిపడ్డారు.
మినీ ట్యాంక్ బండ్ మూసివేతకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చినప్పటికీ ఎమ్మెల్యే స్పందించకపోవడం ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ప్రజల సమస్యలపై స్పందించాల్సిన బాధ్యత ఉన్న ఎమ్మెల్యే, మీడియాలో వచ్చిన వార్తలను కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను గమనించిన మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల స్వయంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మినీ ట్యాంక్ బండ్ను సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నెల రోజులుగా మూతపడి ఉన్న ఈ ప్రదేశాన్ని అధికారులు లేదా ఎమ్మెల్యే తెరుస్తారేమో అని ప్రజలతో పాటు తాము కూడా ఎదురుచూశామని, కానీ ఎలాంటి చర్యలు కనిపించకపోవడంతో నేడు ఆందోళన కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.అయితే మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆందోళనకు వస్తున్నారనే విషయం తెలుసుకున్న వెంటనే ఎమ్మెల్యే ధన్పాల్ తన పరువు పోతుందని గ్రహించి హడావుడిగా గేట్లు తెరిపించారని ఆరోపించారు.గత నెల రోజులుగా మూసివేసి ఉంచిన గేట్లు ఒక్కసారిగా ఎలా తెరుచుకున్నాయని ప్రశ్నించారు. ప్రజల కోసం కాకుండా, తమ వైఫల్యం బయటపడకుండా ఉండేందుకు మాత్రమే గేట్లు తెరిపించడం ఎమ్మెల్యే రాజకీయ నాటకాలకు నిదర్శనమన్నారు.గేట్లు తెరిచిన తర్వాత అక్కడి పరిస్థితిని పరిశీలిస్తే అసలు వాస్తవం బయటపడిందన్నారు. గేటు వద్ద భద్రతా సిబ్బంది లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడం, ఎలాంటి నిర్వహణ కనిపించకపోవడం వల్ల మినీ ట్యాంక్ బండ్ పూర్తిగా అనాథలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చే ప్రదేశంలో కనీస భద్రతా చర్యలు కూడా లేకపోవడం అత్యంత బాధాకరమన్నారు.గతంలో తాము హెచ్చరించినట్లుగానే అక్కడ నాటిన చెట్లు ఎండిపోయి కనిపిస్తున్నాయని, విద్యుత్ దీపాలు పనిచేయక చీకటిమయంగా మారిందని, దొంగిలించబడిన సీసీ కెమెరాలను ఇప్పటివరకు పునరుద్ధరించలేదని, పారిశుధ్య నిర్వహణ కూడా అధ్వాన్నంగా ఉందని తెలిపారు. ఎన్నిసార్లు ప్రజలు, మీడియా, ప్రతిపక్ష పార్టీలు ఈ అంశాలను ప్రస్తావించినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాకపోవడం అధికారుల వైఫల్యాన్ని, ఎమ్మెల్యే నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తోందన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం దూరదృష్టితో నిర్మించిన అభివృద్ధి పనులను కాపాడుకోవడం చేతకాకపోవడం అసమర్థతకు నిదర్శనమని గణేష్ బిగాల విమర్శించారు. కొత్తగా అభివృద్ధి పనులు చేయడం పక్కన పెడితే, ఇప్పటికే నిర్మించిన ప్రజా ఆస్తులను కూడా రక్షించలేని పరిస్థితి నెలకొనడం విచారకరమన్నారు.ప్రజలకు ఉపయోగపడే మినీ ట్యాంక్ బండ్ను నెల రోజుల పాటు మూసివేసి ఉంచి, ప్రజల ఆగ్రహం పెరిగిన తర్వాత, ప్రతిపక్షం ఆందోళనకు దిగుతుందని తెలిసిన వెంటనే గేట్లు తెరిపించడం ద్వారా ఎమ్మెల్యే ధన్పాల్ పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. ఇది కేవలం ఒక మినీ ట్యాంక్ బండ్ సమస్య మాత్రమే కాదని, నిజామాబాద్ నగర అభివృద్ధి నిర్లక్ష్యానికి ప్రతీక అని పేర్కొన్నారు.
మేము ప్రజల కోసం నిర్మించిన మినీ ట్యాంక్ బండ్ను కనీస స్థాయిలో కూడా నిర్వహించలేని ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త నైతిక బాధ్యత వహించి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ప్రజల సమస్యలపై స్పందించలేని, ప్రజా ఆస్తులను కాపాడలేని ప్రజాప్రతినిధికి ఆ పదవిలో కొనసాగే అర్హత లేదు” అని మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల తీవ్రంగా డిమాండ్ చేశారు










