సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
“Helmet On, Worries Gone” అనే సందేశంతో రూపొందించిన భారీ హెల్మెట్ శిల్పాన్ని ఆదివారం ఘనంగా ఆవిష్కరించింది.
మెడికవర్ హాస్పిటల్స్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ శిల్పాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఐఏఎస్ మరియు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ ఆవిష్కరించారు.
సికింద్రాబాద్ మెడికవర్ హాస్పిటల్స్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన హెల్మెట్ను తప్పనిసరిగా ధరించడం ద్వారా తలకు తగిలే తీవ్ర గాయాలను, ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని ముఖ్య అతిథులు పేర్కొన్నారు.
ట్రాఫిక్ నిబంధనలను పాటించడం, హెల్మెట్ ధరించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్ వైద్యులు మాట్లాడుతూ.. ప్రమాద బాధితుల్లో అధిక శాతం మంది తలకు తీవ్రమైన గాయాలతోనే అత్యవసర విభాగానికి చేరుతున్నారని తెలిపారు.
హెల్మెట్ వినియోగం వల్ల ప్రాణాపాయం తగ్గడమే కాకుండా మెదడు దెబ్బతినడం వల్ల కలిగే శాశ్వత వికలాంగత్వం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, కోమా వంటి ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందని వివరించారు.
నగర నడిబొడ్డున ఏర్పాటు చేసిన ఈ భారీ హెల్మెట్ శిల్పం ప్రతిరోజూ వేలాది మందికి రోడ్డు భద్రత ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ అవగాహన చిహ్నంగా నిలవనుంది. “ప్రయాణం ఎంత చిన్నదైనా హెల్మెట్ మాత్రం తప్పనిసరి” అనే సందేశాన్ని ప్రజల్లో బలంగా నాటేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.
“AWARE & ALIVE” భాగంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద నిర్వహించిన ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి ట్రాఫిక్ డీసీపీ రాహుల్ రెడ్డి, మెడికవర్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరోసర్జన్ డా. రమేష్ శిఘాకోలి, హెడ్ ఆఫ్ క్రిటికల్ కేర్ డా. బాలసుబ్రహ్మణ్యం, సెంటర్ హెడ్ కృష్ణవేణి, వైద్యులు, సిబ్బంది, మున్సిపల్ మరియు పోలీసు శాఖల అధికారులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
#Sidhumaroju










