తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ బిడ్డలకు హృదయపూర్వక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర సాధన పోరాటంలో అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను కేసీఆర్ స్మరించుకుంటూ నివాళులు అర్పించారు.
తెలంగాణ ప్రజల మీద దశాబ్దాల పాటు సాగిన అణచివేతపై పోరాడి, అనేక ఆవాంతరాలను అధిగమించి, శాంతియుతమైన పార్లమెంటరీ పంథాలో, ప్రజాస్వామ్య యుతంగా కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు.
ఉమ్మడి పాలనలో తీవ్ర వివక్షకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న తెలంగాణను స్వయం పాలనలో ఒక దిక్సూచిలా మార్చుకున్నామని, పరిపాలన చేతగాదు అని విమర్శించిన నోళ్లు మూతపడేలా ప్రగతి పాలనను అందించామని కేసీఆర్ అన్నారు.
నూతన రాష్ట్రంగా ఏర్పాటైన పదేండ్ల అనతికాలంలోనే సకల జనుల సంక్షేమం, సమస్త రంగాల సమగ్ర ప్రగతిని సాధించి, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుకున్నామని వివరించారు.
సాగునీరు, తాగునీరు, విద్యుత్, వ్యవసాయం, విద్య వైద్యం తదితర సంక్షేమ రంగాల్లో తెలంగాణ సాధించిన ప్రగతి నేడు యావత్ దేశానికి ఆదర్శంగా నిలిచిందనీ, ఒకనాడు ఎడారిలా మారిన తెలంగాణను, నేడు కోటి ఎకరాల మాగాణంగా మార్చి, అన్నపూర్ణగా తీర్చిదిద్దిన ఘనత నాటి పదేండ్ల బి ఆర్ ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందని కేసీఆర్ తెలిపారు.
ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజాన్ని ఈ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు. ప్రతీప శక్తుల నుండి తెలంగాణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిదని కేసీఆర్ అన్నారు.
తెలంగాణ కు బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ రక్షణ కవచంగా నిలుస్తుందని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
స్వరాష్ట్ర సాధనలోనూ, ఆ తర్వాతి పదేండ్ల పునర్నిర్మాణంలోనూ చూపిన స్పూర్థిని నిరంతరం కొనసాగించాలనీ, అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు మరింత గుణాత్మకంగా పెరిగే దిశగా పాలనా ప్రాధాన్యతలను ఎంచుకోవాలనీ, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తూ, వారిలో విశ్వాసం నింపాల్సిన బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉందని కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు.
తెలంగాణ రైతన్న సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి నిరంతరం కొనసాగించాల్సిన బాధ్యతను పాలకులు విస్మరించకూడదని హితవు పలికారు.
తెలంగాణ రాష్ట్రం నిరంతరం ప్రగతి పథంలో దూసుకుపోవాలని, పచ్చని పాడి పంటలతో వర్ధిల్లాలని కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆకాంక్షించారు.
రైతాంగం, శ్రమజీవులు, సబ్బండ వర్గాలు,సకల జనుల జీవితాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో నిండాలని కేసీఆర్ ఈ సందర్భంగా కోరుకున్నారు.







