విజయవాడ నగరపాలక సంస్థ
01-06-2026
*సుస్థిర నగరాల నిర్మాణానికి విజయవాడ వేదిక*
*యునిడో SCIAP ముగింపు సదస్సు ఘనంగా ప్రారంభం*
*దేశవ్యాప్తంగా పాల్గొన్న పట్టణాభివృద్ధి నిపుణులు, మున్సిపల్ కమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు*
విజయవాడ నగరపాలక సంస్థ సహకారంతో ఐక్యరాజ్యసమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (UNIDO), గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ఫెసిలిటీ (GEF), కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoHUA), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (NIUA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ (SCIAP)” ముగింపు సదస్సు సోమవారం విజయవాడలోని లెమన్ ట్రీ ప్రీమియర్ హోటల్లో ఘనంగా ప్రారంభమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన విధాన రూపకర్తలు, పట్టణాభివృద్ధి నిపుణులు, సాంకేతిక నిపుణులు, నగర పాలక సంస్థల ప్రతినిధులు సహా 120 మందికి పైగా ఈ రెండు రోజుల సదస్సులో పాల్గొంటున్నారు.
“పట్టణ సుస్థిరత మరియు వాతావరణ చర్యల పురోగతి” అనే అంశంపై జరుగుతున్న ఈ సదస్సును కేంద్ర గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ సురభి మాలిక్ ప్రారంభించారు. కార్యక్రమంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం., గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కె. మయూర్ అశోక్, పురపాలక శాఖ కమిషనర్ & డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ (వర్చువల్గా), ఎన్ఐయూఏ డైరెక్టర్ డాక్టర్ డెబోలినా కుండు, ఎన్ఐయూఏ రిసోర్స్ అండ్ వేస్ట్ విభాగాధిపతి పరమితా దత్తా డే, ఐసీఎల్ఈఐ సౌత్ ఏషియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇమాని కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా యునిడో సబ్ రీజినల్ ఆఫీస్ డైరెక్టర్ క్రిస్టియానో పసిని, యునిడో ప్రధాన కార్యాలయం వియన్నాకు చెందిన రికార్డో సావిగ్లియానో, జీఈఎఫ్ సెక్రటేరియట్ సస్టైనబుల్ సిటీస్ ప్రోగ్రామ్ లీడ్ అలోక్ బర్నవాల్ వీడియో సందేశాల ద్వారా సుస్థిర పట్టణాభివృద్ధికి సమిష్టి కృషి అవసరాన్ని వివరించారు. అనంతరం యునిడో సీనియర్ టెక్నికల్ అడ్వైజర్ డాక్టర్ నంద్ పాల్ సింగ్, నేషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ దీపికా లేలే SCIAP ప్రాజెక్టు ప్రయాణం, సాధించిన విజయాలు, పట్టణ వాతావరణ చర్యలలో అందించిన సేవలపై సమగ్ర ప్రజెంటేషన్ అందించారు.
ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎం. ధ్యానచంద్ర మాట్లాడుతూ, పట్టణాల సుస్థిర అభివృద్ధి కోసం స్థానిక సంస్థలు వినూత్న కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ స్వచ్ఛత, ఘన వ్యర్థాల నిర్వహణ, ఇంటింటి చెత్త సేకరణ, మూలంలోనే చెత్త వర్గీకరణ, ప్రజా భాగస్వామ్య కార్యక్రమాలు, స్వచ్ఛ సర్వేక్షణ్లో మెరుగైన పనితీరు, పార్కుల అభివృద్ధి, హరితీకరణ, చెరువులు మరియు కాలువల పరిరక్షణ, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి రంగాల్లో అనేక ఉత్తమ విధానాలను అమలు చేస్తోందన్నారు.
సదస్సు తొలి రోజున “వేస్ట్ మేనేజ్మెంట్ అండ్ డీకార్బనైజింగ్ సిటీస్” అంశంపై నిర్వహించిన ప్యానెల్ చర్చలో నిపుణులు పట్టణ ఘన వ్యర్థాల నిర్వహణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, తక్కువ కార్బన్ ఆధారిత అభివృద్ధి విధానాలపై విస్తృతంగా చర్చించారు. పట్టణ సుస్థిరతకు సంబంధించిన పలు కీలక అంశాలపై మరిన్ని సాంకేతిక సమావేశాలు, చర్చలు కొనసాగాయి. వివిధ నగరాల ప్రతినిధులు తమ అనుభవాలు, ఉత్తమ పద్ధతులను పంచుకోవడం ద్వారా సదస్సు విశేషంగా సాగింది.
సదస్సు రెండో రోజు పట్టణాల్లో సమగ్ర వాతావరణ చర్యలను మరింత విస్తరించే అవకాశాలు, అమలు విధానాలు, విజయవంతమైన నమూనాలపై చర్చలు జరగనున్నాయి. అలాగే గుంటూరు జిల్లా జాగర్లమూడిలో ఏర్పాటు చేసిన తేలియాడే సౌర విద్యుత్ ప్లాంట్ మరియు విద్యుత్ త్రిచక్ర వాహనాల ఛార్జింగ్ కేంద్రాలను ప్రతినిధులు సందర్శించనున్నారు. ఈ సదస్సు ద్వారా దేశవ్యాప్తంగా పట్టణ స్థానిక సంస్థల మధ్య ఉత్తమ పద్ధతుల మార్పిడి, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, వాతావరణ మార్పులకు అనుగుణమైన చర్యల అమలు మరింత బలోపేతం అవుతుందని అధికారులు తెలిపారు.










