మేడ్చల్–మల్కాజిగిరి : జిల్లాలో నవ కంటోన్మెంట్ నిర్మాణ లక్ష్యంతో అభివృద్ధి పనులకు మరింత వేగం తీసుకురావాలని సంకల్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ బుధవారం బొల్లారం పరిధిలోని జనప్రియ బంగ్లా, శాంతి నగర్ కాలనీ, గడ్డి బస్తీలలో విస్తృతంగా పర్యటించారు.
సంబంధిత శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి బస్తీల్లో కాలినడకన పర్యటించిన ఎమ్మెల్యే, అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ, సీసీ రోడ్ల నిర్మాణం, విద్యుత్ సరఫరా, కమ్యూనిటీ హాళ్ల అవసరం వంటి పలు మౌలిక వసతుల అంశాలపై స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ మాట్లాడుతూ, నవ కంటోన్మెంట్ నిర్మాణం కేవలం నినాదంగా కాకుండా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చే అభివృద్ధి కార్యక్రమంగా నిలవాలని తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ప్రాంతంలోని మౌలిక వసతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన జీవన వాతావరణాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రభుత్వానికి, తమ ప్రజాప్రతినిధిత్వానికి ప్రధాన ప్రాధాన్యత అని స్పష్టం చేశారు.
ఈ పర్యటనలో కాలనీల అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, యాదగిరి, నాని, రామచంద్రారెడ్డి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో బస్తీవాసులు పాల్గొన్నారు.
#Sidhumaroju










