మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా : మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన జవహర్ నగర్ పి.ఎస్ పరిధిలో, ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించినట్లు మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ తెలిపారు.
ఈ రోజు నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు. ఈ కేసులో పాల్గొన్న కరుడుగట్టిన నేపాలీ ముఠాకు చెందిన నిందితులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన బంగారం, వెండి వస్తువులు, నగదు సహా విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మొహన్స్ గోల్ఫ్ ఎన్క్లేవ్లో నివాసం ఉంటున్న అంతర్జాతీయ ఆర్బిట్రేటర్ మురళీమోహన్ నర్సిపురం దంపతుల ఇంట్లో మే 11వ తేదీ రాత్రి దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందిందని కమిషనర్ తెలిపారు. ఈ మేరకు మే 12న జవహర్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు.
దర్యాప్తులో భాగంగా మీనా, రాజేష్ అనే నేపాలీ జాతీయులు కొంతకాలంగా భారత్లో పనిచేస్తూ సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ నేరానికి కుట్ర పన్నినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే నివసిస్తున్నారని తెలుసుకున్న నిందితులు తమతో పాటు సామ్రాట్, సబీనా అలియాస్ సునీత, డేనియల్ చారోహ్ అలియాస్ చాంగ్, కిరణ్, బిస్వాల్ అలియాస్ విశ్వాల్, జంకర్ బహదూర్ చలౌనే, కమల్ బహదూర్ చలౌనేలను కలుపుకుని ముఠాగా ఏర్పడ్డారని తెలిపారు.
కుట్రలో భాగంగా మీనా, సబీనా అలియాస్ సునీతను బాధితుల ఇంట్లో పనిమనిషిగా చేర్పించగా, రాజేష్ను ఆమె భర్తగా పరిచయం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఇంటి యజమానుల కదలికలు, రోజువారీ అలవాట్లను నిశితంగా గమనిస్తూ అవకాశాన్ని ఎదురుచూశారని చెప్పారు. మే 11న సర్వెంట్ క్వార్టర్స్లో జరిగిన పుట్టినరోజు వేడుకను ఆసరాగా చేసుకుని నిందితులు రాత్రి సమయంలో ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిపారు.
నిందితులు బాధిత దంపతులను అదుపులోకి తీసుకుని మత్తు పదార్థం ఇచ్చి స్పృహ తప్పించారని, అనంతరం వారి చేతులు, కాళ్లు కట్టి ఇనుప రాడ్లతో బెదిరించి అల్మారాలు పగులగొట్టి సుమారు 60 తులాల బంగారు ఆభరణాలు, 15 కిలోల వెండి వస్తువులు, 3 వేల అమెరికన్ డాలర్లు, రెండు మొబైల్ ఫోన్లు మరియు ఇతర విలువైన వస్తువులను అపహరించినట్లు కమిషనర్ వివరించారు.
నేరం అనంతరం ఆటోరిక్షా, స్కూటర్ ద్వారా పరారైన నిందితులు స్కూటర్ను యాప్రాల్ ప్రాంతంలో వదిలిపెట్టి, అనంతరం రెండు ట్యాక్సీల్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుని దేశం విడిచి పారిపోవడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
కేసు నమోదు చేసిన వెంటనే లా అండ్ ఆర్డర్, స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ (ఎస్వోటీ), సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) విభాగాల అధికారులతో మొత్తం ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు బి. సుమతి తెలిపారు.
సాంకేతిక ఆధారాలు, సంఘటనా స్థల పరిశీలన, ఫీల్డ్ ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు సుమారు 255 సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషించినట్లు చెప్పారు. దేశంలోని న్యూఢిల్లీ, లక్నో, బెంగళూరు, పుణే, ముంబై నగరాలతో పాటు నేపాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
దర్యాప్తు ఫలితంగా నిందితులు మీనా, రాజేష్, డేనియల్ చారోహ్ అలియాస్ చాంగ్, కిరణ్లను మే 16న అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు తెలిపారు. అనంతరం కొనసాగిన గాలింపులో మిగిలిన నిందితులను కూడా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.
అరెస్ట్ అయిన నిందితుల్లో మీనా, రాజేష్, కిరణ్లు నేపాల్కు చెందినవారని, డేనియల్ చారోహ్ పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్కు చెందిన వ్యక్తి అని తెలిపారు.
శాస్త్రీయ ఆధారాల పరిశీలనలో మీనా అలియాస్ మమత వేలిముద్రలు సంఘటనా స్థలంలో లభించినట్లు వెల్లడించారు. అలాగే మీనా, రాజేష్లు గతంలో మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన 2023 హౌస్ బ్రేకింగ్ కేసులో కూడా నిందితులుగా ఉన్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు.
నిందితులను విచారించగా వారు నేరాన్ని అంగీకరించడంతో వారి వద్ద నుంచి బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు మరియు ఇతర విలువైన ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ తెలిపారు.
కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించిన మల్కాజ్గిరి జోన్, ఎస్వోటీ, సీసీఎస్ సిబ్బందిని అభినందించిన ఆమె, విశేష కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి తగిన బహుమతులు సిఫారసు చేయనున్నట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా కమిషనరేట్ పరిధిలో భద్రతను మరింత పటిష్టం చేసేందుకు చేపట్టిన “మీ సురక్ష” కార్యక్రమం గురించి కూడా కమిషనర్ వివరించారు. నివాస కాలనీలు, అపార్ట్మెంట్ల భద్రతను పెంపొందించే లక్ష్యంతో ఇంటి పనివారు, డ్రైవర్లు, వాచ్మెన్లు, కేర్టేకర్లు తదితర గృహ సిబ్బంది వివరాలను ఇంటింటికీ వెళ్లి సేకరించి ధృవీకరిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటివరకు 39,270 మంది గృహ సిబ్బంది వివరాలను నమోదు చేయగా, వారిలో 1,276 మంది నేపాలీ జాతీయులు ఉన్నట్లు వెల్లడించారు.
ప్రజలు కూడా పోలీసులకు సహకరించి తమ కాలనీలు, నివాస ప్రాంతాల భద్రతకు తోడ్పడాలని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి విజ్ఞప్తి చేశారు.
#Sidhumaroju










