ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయండి: బండి రమేష్

0
0

మియాపూర్, జూన్ 5 (న్యూస్ డెస్క్): తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి  ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు మియాపూర్‌లో పర్యటించనున్నట్లు టీపీసీసీ ఉపాధ్యక్షుడు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ తెలిపారు. రూ.161 కోట్ల వ్యయంతో నిర్మించనున్న సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవనానికి భూమిపూజతో పాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారని వెల్లడించారు.

శుక్రవారం మియాపూర్‌లో కార్యక్రమ స్థలాన్ని జిల్లా కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించిన బండి రమేష్, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందులో భాగంగానే సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు.

 

ఈ కార్యక్రమానికి మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ , శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ , రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి , కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జ్ కొలను హనుమంత రెడ్డి , శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌చార్జ్ జగదీశ్వర్ గౌడ్, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ముఖ్యమంత్రి పర్యటనను జయప్రదం చేయాలని బండి రమేష్ పిలుపునిచ్చారు.