పరిసరాల పరిశుభ్రతతోనే రోగాలకు దూరం: మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్

0
0

కొమరం భీమ్ ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ 

ఆసిఫాబాద్ : పరిసరాల పరిశుభ్రతతోనే వివిధ రకాల అంటువ్యాధులకు దూరంగా ఉండవచ్చని అసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ తెలిపారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన  ప్రగతి ప్రణాళిక 99వ రోజుల కార్యాచరణ’లో భాగంగా, శనివారం పట్టణంలోని 19వ వార్డులో మున్సిపల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక వార్డు సభకు వారు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని, వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇళ్ల చుట్టుపక్కల ఎక్కడా చెత్తాచెదారం వేయవద్దని సూచించారు. ముఖ్యంగా డ్రైనేజీలలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పడేయడం వల్ల మురుగునీరు నిలిచిపోయి దోమలు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించిన వారు, వార్డులలో ప్రజలకు ఏ సమస్య ఉన్నా స్థానిక కౌన్సిలర్ల దృష్టికి తీసుకురావాలని, మున్సిపల్ యంత్రాంగం ద్వారా వాటిని వెంటనే పరిష్కరిస్తామని, ప్రజా సంక్షేమం కోసం తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించేలా విచ్చేసిన ప్రజలకు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అధికారులు కలిసి మొక్కలను అందజేసి, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించాలని కోరగా, ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అంజయ్య, స్థానిక కౌన్సిలర్లు చిలువేరు వెంకటేశ్వర్లు, సాలం బీన్ అహ్మద్, జేబా షేక్, విద్యుత్ శాఖ ఏఈ కే. లక్ష్మీరాజం, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు సాయి శ్రావణ్ మరియు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.