మంచిర్యాల : ప్రజల సంక్షేమం, రైతుల అభ్యున్నతి, ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ అన్నారు.
శనివారం దండేపల్లి మండలం గూడెంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్,MLA ప్రేమసాగర్తో కలిసి శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానం పునరుద్ధరణ పనులు, మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా గూడెం దేవస్థానం అభివృద్ధికి భారీ స్థాయిలో నిధులు మంజూరు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా ముందుకు సాగుతోందన్నారు,రైతులకు సాగునీటి అందుబాటును మరింత మెరుగుపరిచే లక్ష్యంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఆధారంగా రూ.74.40 కోట్ల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల నిర్మాణ పనులు ప్రారంభించడం జిల్లాలోని వ్యవసాయ రంగానికి ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. ఈ పథకాల ద్వారా వందలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, ఆధ్యాత్మిక రంగాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, మంచిర్యాల జిల్లా అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మరిన్ని నిధులు తీసుకురావడానికి తాను కృషి చేస్తానని ఎంపీ తెలిపారు,ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.










