మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం విస్తృత స్థాయిలో తనిఖీలు నిర్వహించారు.
అక్రమ మార్గాల్లో తెలిసిన ఆదాయ వనరులను మించి ఆస్తులు సమకూర్చుకున్నారనే అభియోగాలపై అవినీతి నిరోధక చట్టం-1988 (2018 సవరణలతో)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన అధికారులు, హైదరాబాద్లోని అల్వాల్ సూర్యనగర్ నివాసంతో పాటు నిజామాబాద్లోని అద్దె ఇంటి సహా కుటుంబ సభ్యులు, బినామీలు, సన్నిహితులకు సంబంధించిన మొత్తం 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు.
తనిఖీల సందర్భంగా నాలుగు నివాస గృహాలు, ఒక వాణిజ్య భవనం, ఎనిమిది ఖాళీ స్థలాలు, 10.23 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు గుర్తించారు.
అలాగే సుమారు రూ.3.31 లక్షల నగదు, రూ.50 లక్షల మేర బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మల్లారెడ్డి భార్యతో పాటు కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న మూడు బ్యాంకు లాకర్లను కూడా గుర్తించగా, వాటిని త్వరలో తెరిచి పరిశీలించనున్నట్లు సమాచారం.
అదేవిధంగా ఒక గ్రాండ్ విటారా కారు, ఒక టీవీఎస్ స్కూటీని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఆస్తుల విలువ సుమారు రూ.3 కోట్లుగా అంచనా వేస్తున్నప్పటికీ, ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ మరింత ఎక్కువగా ఉండే అవకాశముందని ఏసీబీ వర్గాలు పేర్కొన్నాయి.
మరికొన్ని ఆస్తులకు సంబంధించిన వివరాల సేకరణ కొనసాగుతోందని, దర్యాప్తు పూర్తయ్యే వరకు మరిన్ని అంశాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
సోదాల అనంతరం మల్లారెడ్డిని నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించనున్నట్లు వెల్లడించారు.
ఇదిలా ఉండగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు లేదా ఇతర అధికారిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయాలని శాఖ సూచించింది.
#,Sidhumaroju
Alwal










