“ఒడిశా నుంచి నాగ్పూర్కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు అరెస్ట్, అదుపులో ఒక బాలుడు”
సికింద్రాబాద్, జూలై 6: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను జీఆర్పీ సికింద్రాబాద్, ఈగల్ టీమ్ (టీజీఎన్బీ), ఆర్పీఎఫ్ సంయుక్తంగా పట్టుకున్నాయి. శనివారం (జూలై 5) నిర్వహించిన తనిఖీల్లో మహారాష్ట్రకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఒక బాలుడిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.20.56 లక్షల విలువైన 41.131 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన వారిలో మహేష్ దిలీప్ వాంధరే (25), కార్తీక్ చంద్రకాంత్ అంబే (30) ఉండగా, మరో 17 ఏళ్ల బాలుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై క్రైం నంబర్ 344/2026 కింద ఎన్డీపీఎస్ చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టంలోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు.
పోలీసుల విచారణలో ఒడిశాలోని బలంగీర్కు చెందిన సంజు సాహు గంజాయి ప్యాకెట్లను నిందితులకు అప్పగించి మహారాష్ట్రలోని నాగ్పూర్కు తరలించాలని ఆదేశించినట్లు వెల్లడైంది. నిందితులు దక్షిణ్ ఎక్స్ప్రెస్లో నాగ్పూర్ వెళ్లేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వేచి ఉండగా తనిఖీలు నిర్వహించిన పోలీసులు వారిని పట్టుకున్నారు. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజు సాహు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఆపరేషన్లో జీఆర్పీ సికింద్రాబాద్, టీజీఎన్బీ ఈగల్ టీమ్, ఆర్పీఎఫ్ అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు. కేసును ఛేదించిన పోలీసు బృందాన్ని రైల్వే, రోడ్డు భద్రత ఐజీ కె. రమేష్ నాయుడు అభినందిస్తూ, వారి ప్రతిభకు తగిన ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు ప్రకటించారు.
#Sidhumaroju










