–మహిళా ట్రైనీ ఐపీఎస్ ఫిర్యాదుతో కేసు నమోదు.
–సస్పెన్షన్ అనంతరం విషపూరిత ద్రవం సేవించిన అధికారి.
హైదరాబాద్, జులై 20: దేశంలోనే అత్యున్నత పోలీసు శిక్షణా కేంద్రమైన హైదరాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదు మేరకు లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఎం. ఉదయ్ కృష్ణారెడ్డిపై అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
మహిళా అధికారిణి ఇచ్చిన లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత (BNS)లోని పలు సెక్షన్లతో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ప్రాథమిక విచారణ అనంతరం అకాడమీ అధికారులు ఉదయ్ కృష్ణారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది.
ఫిర్యాదు ప్రకారం జూన్ 23 నుంచి వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపడంతో పాటు తోటి ట్రైనీల సమక్షంలో అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు.
జూలై 8న ఆమె మొబైల్ ఫోన్ను బలవంతంగా తీసుకుని పాస్వర్డ్ తెలుసుకున్న అనంతరం వ్యక్తిగత వీడియోలను రికార్డు చేసి, వాటిని ఆమె భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా, ఒక సందర్భంలో ఆమెను గదిలోకి బలవంతంగా తీసుకెళ్లి మెడపై కత్తి పెట్టి బెదిరించినట్లు కూడా ఆరోపించారు.
కేసు నమోదు అనంతరం సోమవారం ఉదయం ఉదయ్ కృష్ణారెడ్డి మోతీనగర్లోని తన సోదరుడి నివాసంలో విషపూరిత ద్రవం సేవించినట్లు తెలిసింది.
అపస్మారక స్థితిలో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఎస్ఆర్ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స కొనసాగుతోంది. దీంతో ఈ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఈ ఘటనకు ముందు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టులో తనపై వచ్చిన ఆరోపణలు, జరుగుతున్న ప్రచారం అవాస్తవమని, చట్టంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు.
ప్రస్తుతం లైంగిక వేధింపుల కేసుతో పాటు విషపూరిత ద్రవం సేవించిన అంశంపైనా పోలీసులు విడివిడిగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
#Sidhumaroju









