బంజారాహిల్స్‌లో భారీ బంగారం అపహరణ కేసు ఛేదన.|

0
13

● ఇద్దరు సోదరుల అరెస్ట్.. కిలోకు పైగా నగల స్వాధీనం.

● జ్యువెలరీ కంపెనీ ఉద్యోగే పథకం ప్రకారం నేరానికి పాల్పడినట్లు వెల్లడి.

● టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు సంయుక్తంగా కేసు ఛేదింపు.

హైదరాబాద్, జూలై 22: బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేట్ జ్యువెలరీ కంపెనీలో జరిగిన భారీ బంగారం అపహరణ కేసును టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు ఛేదించినట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ తెలిపారు.

ఈ కేసులో ఇద్దరు సోదరులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 1 కిలో 28.59 గ్రాముల విలువైన నగలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

డీసీపీ వివరాల ప్రకారం, అదే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న సోంకాంబ్లే హరీష్ (29) సంస్థలో భద్రపరిచిన ఆభరణాలపై ముందుగానే నిఘా పెట్టాడు. జూలై 16న నేరానికి ప్రయత్నించినప్పటికీ సఫలం కాలేకపోయాడు.

అనంతరం జూలై 17న విద్యుత్ సరఫరాను నిలిపివేసి, బాత్‌రూమ్ గ్రిల్‌ను ధ్వంసం చేసి కార్యాలయంలోకి ప్రవేశించి భద్రపరిచిన నగలను తీసుకెళ్లినట్లు విచారణలో తేలిందన్నారు.

అపహరించిన ఆస్తిని తన సోదరుడు సోంకాంబ్లే ఆకాష్ (25) వద్ద దాచిపెట్టినట్లు గుర్తించినట్లు డీసీపీ పేర్కొన్నారు.

నిందితుల నుంచి ఏడు బంగారు హారాలు, ఏడు జతల బంగారు చెవిపోగులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

ఈ ఘటనపై క్రైమ్ నం. 648/2026 కింద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు టాస్క్‌ఫోర్స్ డీసీపీ స్పష్టం చేశారు.

#Sidhumaroju