మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె డేగల రామయ్య వీధిలో గత ఏడు నెలలుగా కాలువలు, చెత్తను శుభ్రం చేయకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వీధివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు పూర్తిగా మురుగునీరు, చెత్తతో నిండిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని, దోమల బెడద కూడా పెరిగి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడే పరిస్థితి ఏర్పడిందన్నారు.
పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి కాలువలను శుభ్రం చేయించి, చెత్తను తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని నక్కలదిన్నె డేగల రామయ్య వీధి ప్రజలు విజ్ఞప్తి చేశారు.










