● బోనాల ఉత్సవాల సందర్భంగా ఆర్థిక సహకార చెక్కుల పంపిణీ
● రాష్ట్ర ప్రభుత్వానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కృతజ్ఞతలు
● పురాతన ఆలయాలకు మరింత నిధులు కేటాయించాలని విజ్ఞప్తి
మల్కాజ్గిరి, ఆగస్టు 3: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల దేవాదాయ ఆర్థిక సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు మల్కాజ్గిరి వాణినగర్లోని శ్రీ విజయ వినాయక స్వామి దేవాలయంలో సోమవారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆర్థిక సహకార చెక్కులను ఆలయాల ప్రతినిధులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యతో పాటు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహించేందుకు దేవాలయాలకు అందిస్తున్న ఆర్థిక సహకారం అభినందనీయమని అన్నారు. మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పురాతన, ప్రసిద్ధ దేవాలయాలకు మరింత అధికంగా నిధులు కేటాయించడంతో పాటు నూతన ఆలయాలకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖలను కలిసి కోరినట్లు తెలిపారు.
తమ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గంలోని 207 దేవాలయాలకు రూ.76.03 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేయడం పట్ల ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, దేవాదాయ శాఖ అధికారులకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలందరూ ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ మోహన్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణ అధికారులు, ప్రధాన అర్చకులు, మాజీ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీల ప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










