మదనపల్లె, ఆగస్టు 2: మదనపల్లె పట్టణంలోని నీరుగట్టువరిపల్లె మాయాబజార్లో గల జే పి తేక్వొందో అకాడమీ ఆధ్వర్యంలో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ పోటీలు ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నారుల్లో క్రమశిక్షణ, ఆత్మరక్షణ నైపుణ్యాలు, శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంలో కరాటే, తేక్వొందో వంటి యుద్ధకళలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యతో పాటు ప్రతి విద్యార్థి కనీసం ఒక క్రీడలో ప్రావీణ్యం సాధించాలని, క్రీడలు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, పోరాట స్ఫూర్తిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. స్వర్గీయ పి. జయకుమార్ ఆశయాలను కొనసాగిస్తూ ఆయన తనయుడు పి. విఘ్నేశ్, శివకుమార్, గంగరాజు చిన్నారులకు అందిస్తున్న శిక్షణను శ్రీరామ్ చినబాబు అభినందించారు. యువతను క్రీడల వైపు ప్రోత్సహిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్, మోటివేషనల్ స్పీకర్ డి.జి. రామమూర్తి, బీజేపీ యువ నాయకుడు సింహం శ్రీకాంత్, అకాడమీ శిక్షకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.










