9న నల్లబెల్లికి కేసీఆర్
పెద్ది కుటుంబాన్ని పరామర్శించనున్న మాజీ సీఎం
భారత్ అవాజ్ న్యూస్ : వరంగల్ జిల్లా నర్సంపేట టౌన్ : దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 9న నల్లబెల్లి మండలానికి రానున్నారు. కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజాసేవలను స్మరించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి జ్ఞాపకార్థం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 9, 10 తేదీల్లో రెండు రోజుల పాటు సంస్మరణ సభలు నిర్వహించనున్నారు. తొలి రోజు జరిగే కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానుండగా, రెండో రోజు మాజీ మంత్రి హరీశ్రావు పాల్గొని నివాళులర్పించనున్నారు. ఈ కార్యక్రమాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో నల్లబెల్లి, నర్సంపేట ప్రాంతాల్లో బీఆర్ఎస్ శ్రేణులు విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణానంతరం ఆయన కుటుంబాన్ని స్వయంగా పరామర్శించేందుకు కేసీఆర్ రావడం, అనంతరం రెండు రోజుల పాటు సంస్మరణ సభలు నిర్వహించనున్న నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ రాజకీయాల్లో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.. దుగ్గొండి మండలం రిపోర్టర్ జి రాము










