● స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి
● దేశభక్తి, త్యాగం, ఆత్మగౌరవంతోనే దేశం సుభిక్షం
● తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు
మేడ్చల్-మల్కాజిగిరి, ఆగస్టు 14: ఉప్పల్ వెంకట్రెడ్డినగర్ డివిజన్లో నిర్వహించిన తిరంగా ర్యాలీలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పాల్గొన్నారు.
జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ పటంలో గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ కొనసాగుతోందని అన్నారు. భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు వేరైనా దేశ ప్రజలను ఏకం చేసేది దేశభక్తేనని పేర్కొన్నారు.
‘‘దేశమంటే మట్టి కాదోయ్.. దేశమంటే మనుషులోయ్’’ అని గురజాడ అప్పారావు చెప్పిన విషయాన్ని ప్రస్తావించిన ఈటల రాజేందర్.. దేశం అంటే కేవలం అభివృద్ధి, ఆర్థిక ప్రగతి మాత్రమే కాదని, దేశం పట్ల నిబద్ధత, త్యాగం, ఆత్మగౌరవం కలిగి ఉండటమని అన్నారు. ఈ భావనతోనే ప్రధాని నరేంద్ర మోదీ తిరంగా ర్యాలీలకు పిలుపునిచ్చారని పేర్కొన్నారు.
విదేశీ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం ఎందరో భారతమాత ముద్దుబిడ్డలు ప్రాణత్యాగాలు చేశారని, జైళ్లలో మగ్గారని గుర్తుచేశారు.
నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ వారి త్యాగాల ఫలితమేనని అన్నారు. భావితరాలకు స్వాతంత్ర్య సమరయోధుల దేశభక్తి, త్యాగాల గురించి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సూచించారు.
మహాత్మా గాంధీ అహింసాయుత పోరాటం చేయగా, సుభాష్ చంద్రబోస్ సైనిక పోరాటం ద్వారా స్వాతంత్ర్య ఉద్యమానికి బలాన్నిచ్చారని ఈటల రాజేందర్ పేర్కొన్నారు. భావితరాల్లో దేశభక్తి పెంపొందితేనే దేశం సుభిక్షంగా ఉంటుందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ప్రజలను కోరారు. తిరంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, బీజేపీ సీనియర్ నాయకులు గడ్డం సాయి, రామంతాపూర్ కార్పొరేటర్ శ్రీవాణి వెంకట్రావు, సీనియర్ నాయకులు మహేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
#sidhumaroju
Alwal










