తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని సముద్ర తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సరదాగా సముద్ర స్నానానికి వెళ్లిన నలుగురు యువకుల్లో ఇద్దరు భారీ అలల ఉద్ధృతికి గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన యువకుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి, ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం ఆయన జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలను తక్షణమే ముమ్మరం చేయాలని ఆదేశించారు. గజ ఈతగాళ్లు, ప్రత్యేక రెస్క్యూ బృందాలతో పాటు మెరైన్ పోలీసులు, కోస్ట్ గార్డ్, స్థానిక మత్స్యకారుల సహాయాన్ని కూడా తీసుకోవాలని సూచించారు.









