కాంగ్రెస్‌పై అసెంబ్లీలో సమరమే.. బీఆర్‌ఎస్‌కు కేసీఆర్‌ దిశానిర్దేశం.|

0
2

● ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ఎల్పీ భేటీ

● 22ఏ భూములు, ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయం

● ప్రజా సమస్యలపై ఉభయ సభల్లో గళమెత్తాలని సూచన

ఆల్వాల్, సెప్టెంబర్‌ 6: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన ఆదివారం ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లో బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష భేటీ జరిగింది.

మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ప్రతిపక్షంగా అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్‌ సభ్యులతో చర్చించారు. అసెంబ్లీ, శాసనమండలి కార్యక్రమాలకు క్రమం తప్పకుండా హాజరై చర్చల్లో చురుగ్గా పాల్గొనాలని కోరారు.

ప్రజలకు సంబంధించిన అంశాలను ప్రాధాన్యంగా లేవనెత్తి అధికార పక్షాన్ని జవాబుదారీగా నిలబెట్టాలని చెప్పారు.

రైతులు, యువత, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఉభయ సభల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.

కాంగ్రెస్‌ ఎన్నికల హామీల అమలు, పెండింగ్‌ సంక్షేమ పథకాలపై ప్రశ్నించాలని చెప్పారు. ముఖ్యంగా భూముల నిషేధిత జాబితాలోని 22ఏ అంశాన్ని బలంగా ప్రస్తావించి, బాధితులకు పరిష్కారం లభించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు.

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ విడుదల చేసిన ఛార్జ్‌షీట్‌లోని అంశాలను కూడా అసెంబ్లీలో లేవనెత్తాలని నిర్ణయించారు.

ప్రజల తరఫున బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తూ, ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని కేసీఆర్‌ పార్టీ ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు.

#sidhumaroju

Alwal