కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి

0
1

చింతూరు ఏజెన్సీ మన్య ప్రాంతంలో గిరిజన ప్రజలకు అండగా నిలిచి, మరో మన్యం వీరుడు అల్లూరిగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ శ్యామల వెంకటరెడ్డి 30వ వర్ధంతి ఆదివారం ఏడుగురాళ్లపల్లిలోని చింతూరు సిపిఎం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన వర్ధంతి సభలో సీనియర్ సిపిఎం నాయకులు ఎర్రంశెట్టి శ్రీనివాసరావు, శాఖ కార్యదర్శి ఎస్కే షాజహాన్ మాట్లాడుతూ… “ఆదివాసీలకు అండగా ఉంటూ వ్యవసాయ పద్ధతులను తెలుపుతూ, సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపజేస్తూ మల్లంపేట వంటి మారుమూల గిరిజన గ్రామాల వరకు బీటీ రోడ్డు వేయించి, ఆర్టీసీ బస్సు సౌకర్యాలు, సిబ్బందికి భోజన వసతి సౌకర్యాలు కల్పించిన ఘనత శ్యామల వెంకటరెడ్డిదే” అని కొనియాడారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తూ,

అజ్ఞానం అనే అంధకారం నుండి జ్ఞానం వైపు ప్రజలను చైతన్యవంతం చేస్తున్న వెంకటరెడ్డిపై మావోయిస్టులు కక్షగట్టి హత్య చేయడం హేయమైన చర్య అని ఖండించారు. పోడు భూముల పట్టాలకై, తునికాకు బోనస్, వెదురు కార్మికుల కూలీలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులకై ధైర్యంగా ఉద్యమించిన ధీరుడు అని అన్నారు. 1996 సెప్టెంబర్ 6వ తేదీన నరహంతక పీపుల్స్ వార్ నక్సలైట్లు వెంకటరెడ్డిని హత్య చేసి పొట్టనపెట్టుకున్నారని, ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన పోరాట స్ఫూర్తి, తెగింపు, ధైర్య సాహసాలు నేటికీ మన కళ్ళ ముందు మెదులుతున్నాయని, ఆయన ఆశయ సాధనకై ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.

తొలుత సిపిఎం పార్టీ జెండాను సీనియర్ నాయకులు కోటేశ్వరరావు ఎగురవేశారు. అనంతరం శ్యామల వెంకటరెడ్డి చిత్రపటానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు మల్లం సుబ్బమ్మ, పొడియం లక్ష్మణ్, మండల కమిటీ సభ్యులు చింతా రాంబాబు, సవలం కన్నయ్య, నాయకులు పల్లపు పెద్దరాములు, సోడి దుర్గారావు, మడివి రాజేష్, సవలం దేశయ్య, ఆసు గణేష్, కోటేశ్వరరావు, పి. సుబ్బారావు, జయలక్ష్మి, ప్రియాంక, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 

# Yadagiri