నెల్లూరులో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఘనస్వాగతం.|

0
2

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ సోమవారం నెల్లూరు జిల్లా పర్యటనకు విచ్చేశారు. వెంకటాచలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ (రజతోత్సవ) వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, వై. సత్యకుమార్ సాదరంగా స్వాగతం పలికారు.

 

అక్షర విద్యాలయం పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో దిగిన యోగికి మంత్రులతో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుమార్తె, ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, కుమారుడు హర్షవర్ధన్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం యోగి అక్షర విద్యాలయం ప్రాంగణంలో ఉన్న సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు.

 

అక్కడ నైపుణ్య శిక్షణ పొందుతున్న యువతీయువకులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. వారికి అందుతున్న సాంకేతిక శిక్షణ, భవిష్యత్ అవకాశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ అందిస్తున్న సేవలను, అక్షర విద్యాలయం ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు చేస్తున్న కృషిని యోగి ఆదిత్యానాథ్ ప్రశంసించారు. ప్రాంగణంలో విద్యార్థులు నిర్వహించిన స్కేటింగ్ ప్రదర్శనను కూడా ఆయన ఆసక్తిగా తిలకించారు.