ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగవంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జ్లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈసారి అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీలోని ఇతర కీలక నేతలకు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను క్రియాశీలం చేయడంతో పాటు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ నేతలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం వంటి కీలక బాధ్యతలను ఈ ఇన్ఛార్జ్లు నిర్వర్తించనున్నారు. విజయనగరానికి ఎంపీ చింతకాయల విజయ్, తూర్పుగోదావరికి దేవినేని ఉమామహేశ్వరరావు, పల్నాడుకు కొనకళ్ల నారాయణ, పశ్చిమగోదావరికి ఎంపీ భాష్యం రామకృష్ణ వంటి పలువురు సీనియర్లకు పార్టీ కీలక బాధ్యతలు అప్పగించింది.










