పాలనలో డిజిటల్ సేవలు ముఖ్యం: సీఎం చంద్రబాబు|

0
2

ప్రభుత్వ, పరిపాలన సేవలను ప్రజలకు మరింత సమర్థంగా అందించడంపై దృష్టి సారించాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపునిచ్చారు. రెండోరోజు లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన ఆయన, కొన్ని నియోజకవర్గాలు పౌర సేవల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నాయని, అన్ని నియోజకవర్గాలు ఆ ఉత్తమ పద్ధతులను (బెస్ట్ ప్రాక్టీసెస్) అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

 

ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఉచిత ఇసుక విధానాన్ని పక్కాగా అమలు చేస్తున్నామని, దీనివల్ల ఏటా రూ.1000 కోట్ల ఆదాయం వదులుకుంటున్నామని చంద్రబాబు గుర్తుచేశారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిపోతే కఠినంగా అడ్డుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి, నకిలీ బ్రాండ్లతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఇప్పుడు మద్యం విక్రయాల్లో పారదర్శకత తీసుకొచ్చామని, ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువకు విక్రయించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయంలో అవకతవకలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు.