లంచం అడిగాడు.. ఏసీబీకి దొరికాడు.|

0
10

● కాంట్రాక్టర్ నుంచి లంచం డిమాండ్

● రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ

● 24 పనుల క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి డిమాండ్

ఆల్వాల్, సెప్టెంబరు 8: హైదరాబాద్‌లో అవినీతి అధికారులపై యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) నిఘా కొనసాగుతోంది.

కాంట్రాక్టర్‌కు అధికారికంగా చేయాల్సిన పనికి రూ.10 వేల లంచం తీసుకుంటున్న ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డిప్యూటీ ఈఈ) సాయి రామ్‌ను ఏసీబీ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఏసీబీ వివరాల ప్రకారం.. కాంట్రాక్టర్ చేపట్టిన ఒక కాంట్రాక్ట్ పనికి ఇప్పటికే జారీ చేసిన క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్‌కు సంబంధించిన ఫైలును ముందుకు పంపడంతో పాటు, మరో 24 కాంట్రాక్ట్ పనులకు క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు సాయి రామ్ రూ.10 వేలు డిమాండ్ చేశారు. లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.

ఫిర్యాదుపై స్పందించిన ఏసీబీ సిటీ రేంజ్-1 బృందం పక్కా ప్రణాళికతో వల పన్నింది.

సెప్టెంబరు 8న ముషీరాబాద్ డివిజన్ క్వాలిటీ కంట్రోల్ సెల్ కార్యాలయంలో కాంట్రాక్టర్ నుంచి రూ.10 వేల లంచం స్వీకరిస్తుండగా సాయి రామ్‌ను అధికారులు పట్టుకున్నారు.

ఆయన వద్ద నుంచి లంచం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడిపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, నాంపల్లిలోని ఎస్పీఈ అండ్ ఏసీబీ కేసుల మొదటి అదనపు ప్రత్యేక న్యాయమూర్తి ఎదుట జ్యుడీషియల్ రిమాండ్ కోసం హాజరుపరచనున్నారు.

కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఫిర్యాదుదారుడి భద్రత దృష్ట్యా ఆయన వివరాలను గోప్యంగా ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రజలకు సూచించారు.

#Sidhumaroju

Alwal