ఆసిఫాబాద్‌లో ఘనంగా పొలాల అమావాస్య వేడుకలు|

0
4

🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో పొలాల అమావాస్య వేడుకలను రైతులు అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా జరుపుకున్నారు. వ్యవసాయ పనుల్లో తమకు చేదోడు వాదోడుగా నిలిచే మూగజీవాలను, ముఖ్యంగా ఎడ్లను (బసవన్నలను) దైవస్వరూపంగా భావించి పూజించడం ఈ పండుగ ప్రత్యేకత. పొలం పనులు ముగిసిన తరుణంలో కృతజ్ఞతగా జరుపుకునే ఈ పండుగ సందర్భంగా. జిల్లా వ్యాప్తంగా రైతులు ఉదయాన్నే తమ బసవన్నలను చెరువులు, వాగుల వద్దకు తీసుకెళ్లి శుభ్రంగా కడిగారు. అనంతరం వాటి కొమ్ములకు రంగులు పూసి, పూలదండలు, గజ్జలు, అందమైన జూళ్లతో ముస్తాబు చేశారు. ఇళ్లకు తీసుకువచ్చిన పశువులకు మహిళలు హారతులు ఇచ్చి, ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాలను సమర్పించారు.సాయంత్రం వేళ జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులపై ముస్తాబు చేసిన బసవన్నలతో రైతులు భారీ ప్రదర్శన నిర్వహించారు. డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మోతల నడుమ రైతులు ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ బసవన్నలను ఊరేగించడంతో ఆసిఫాబాద్ వీధులన్నీ పండుగ శోభతో సంతరించుకున్నాయి. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ ప్రదర్శనను చూసేందుకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతటా సంబరాల వాతావరణం నెలకొంది.