జాహ్నవి మృతిపై కలెక్టర్‌కు NCST నోటీసులు |

0
0

పోలవరం జిల్లా కునవరం మండలం కోతులగుట్ట గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని తెల్లం జాహ్నవి వైద్య నిర్లక్ష్యంతో మృతి చెందిన దారుణ ఘటనపై జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) తీవ్రంగా స్పందించింది. ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను సమర్పించిన ఆధారాలతో కూడిన ఫిర్యాదును స్వీకరించిన కమిషన్, ఈ దారుణ ఘటనపై ఫైల్ నెంబర్: NCST/ATY-4646/AP/544/2026-RO-BHUV/RU-III ద్వారా పోలవరం జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ మరియు రాష్ట్ర ఆరోగ్య, వైద్య కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శికి అధికారికంగా నోటీసులు జారీ చేసింది, అధికారుల నిర్లక్ష్యంపై NCST విచారణ.

కోతులగుట్ట గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వి. రాధిక పద్మశ్రీ చూపిన తీవ్ర నిర్లక్ష్యం, కోటులగుట్ట సీహెచ్‌సీ (CHC) వైద్య సిబ్బంది వైఫల్యం వల్లనే అమాయక గిరిజన విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందని, ఈ అంశంపై భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 338A ప్రకారం కమిషన్ నేరుగా విచారణకు స్వీకరించిందని కుంజ శ్రీను తెలిపారు. బాధ్యులైన ప్రిన్సిపాల్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం, ఉద్యోగం నుండి సస్పెండ్ చేయడం, వైద్య యంత్రాంగం వైఫల్యాలపై చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి తక్షణ పరిహారం అందించాలన్న డిమాండ్లపై 15 రోజుల్లోగా (15 Days) యాక్షన్ టేకన్ రిపోర్ట్ (ATR) సమర్పించాలని కమిషన్ డైరెక్టర్ డాక్టర్ పి. కళ్యాణ్ రెడ్డి ఆదేశించినట్లు పేర్కొన్నారు.

సమన్లు జారీ చేస్తామని హెచ్చరిక. కమిషన్ కేటాయించిన నిర్ణీత సమయంలోగా జిల్లా యంత్రాంగం నుండి సరైన వివరణ రాకపోతే, రాజ్యాంగం కల్పించిన సివిల్ కోర్టు అధికారాలను ఉపయోగించి అధికారులను స్వయంగా హాజరయ్యేలా సమన్లు (Summons) జారీ చేస్తామని నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారని శ్రీను తెలిపారు. ఇకనైనా జిల్లా అధికారులు గిరిజన విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడటం విడనాడి, తక్షణమే బాధ్యులైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, లేనిపక్షంలో జాతీయ కమిషన్ వేదికగా చట్టపరమైన పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆదివాసీ సంక్షేమ పరిషత్ స్పష్టం చేసింది.

 

# Yadagiri