గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షెడ్యూల్ విడుదల.|

0
12

● పాత ఓటర్లు కూడా కొత్తగా ఫారం-18 సమర్పించాలి

● నవంబర్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ

● డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితా

హైదరాబాద్, సెప్టెంబర్ 17: తెలంగాణలోని రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్తగా ఓటర్ల జాబితా సిద్ధం చేసే ప్రక్రియకు ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్, వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గాల ప్రస్తుత సభ్యుల పదవీకాలం 2027 మార్చిలో ముగియనున్న నేపథ్యంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నారు.

అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేందుకు సెప్టెంబర్ 28న ప్రజా నోటీసు జారీ చేయనున్నారు. అక్టోబర్ 15, 25 తేదీల్లో పత్రికల్లో నోటీసులు ప్రచురించనుండగా, నవంబర్ 6 వరకు ఫారం-18 దరఖాస్తులను స్వీకరిస్తారు.

నవంబర్ 25న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని డిసెంబర్ 25లోగా పరిష్కరించి, డిసెంబర్ 30న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.

గతంలో ఓటరుగా నమోదైన పట్టభద్రులు కూడా ఈసారి తప్పనిసరిగా కొత్తగా ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. పాత జాబితాలో పేరు ఉన్నంత మాత్రాన ఈసారి ఓటు హక్కు కొనసాగదని తెలిపింది. దరఖాస్తుతో పాటు విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాల ధ్రువీకరించిన కాపీలను సమర్పించాల్సి ఉంటుంది.

అర్హులైన పట్టభద్రులు సీఈఓ తెలంగాణ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో లేదా సంబంధిత ఈఆర్‌ఓ, ఏఈఆర్‌ఓ కార్యాలయాల్లో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం వెల్లడించింది.

#Sidhumaroju

Alwal