కార్యకర్తలే నా బలం.. బాధపడి ఉంటే క్షమించండి: ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి!

0
2

అడ్డతీగలలో గతంలో జరిగిన సమావేశంలో తాను మాట్లాడిన మాటల్లోని కొన్ని భాగాలు మాత్రమే సామాజిక మాధ్యమాల్లో ప్రచారంలోకి వచ్చాయని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి తెలిపారు. శుక్రవారం రాజవొమ్మంగి మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ ఆమె ఈ విషయంపై వివరణ ఇచ్చారు. సమావేశంలో తాను మాట్లాడిన పూర్తి విషయాన్ని కాకుండా, కొన్ని మాటలను మాత్రమే విడిగా తీసుకుని ప్రచారం చేయడం వల్ల తన మాటల అసలు ఉద్దేశం వేరుగా అర్థమయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆమె తెలిపారు. ఆ సమావేశంలో ఏ పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది, ఏ సందర్భంలో ఆ మాటలు వచ్చాయి, వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటో పూర్తి వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతుందని చెప్పారు.కార్యకర్తలతో మాట్లాడే సమయంలో తాను కొంత కఠినంగా మాట్లాడి ఉంటే, ఆ మాటల వల్ల ఎవరైనా బాధపడి ఉంటే తనను క్షమించాలని ఎమ్మెల్యే మనస్ఫూర్తిగా కోరారు. కార్యకర్తలను బాధపెట్టాలనే ఉద్దేశంతో తాను ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు.“కార్యకర్తలు ఉంటేనే నేను ఉన్నాను. నా ఒక్కరి సంకల్పంతోనే నేను ఎమ్మెల్యే కాలేదు. కార్యకర్తల బలం, వారి నమ్మకం, వారి కష్టంతోనే ఈరోజు రంపచోడవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు వచ్చింది” అని శిరీష దేవి అన్నారు. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని సరిచేయడానికి కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో గట్టిగా మాట్లాడాల్సి వస్తుందని, అదే భావనతో ఆ సమయంలో కార్యకర్తలతో మాట్లాడానని ఆమె వివరించారు. కార్యకర్తలను తాను కేవలం రాజకీయంగా తనతో పనిచేసే వారిగా కాకుండా కుటుంబ సభ్యులుగానే భావిస్తానని తెలిపారు. తన మాటల్లో కఠినత కనిపించి ఉండొచ్చని, అయితే వాటిని పూర్తి సందర్భంలో చూస్తే ఆ సమయంలో తాను చెప్పాలనుకున్న విషయం స్పష్టమవుతుందని ఆమె పేర్కొన్నారు. తన మాటల వల్ల ఏ కార్యకర్త మనసైనా నొచ్చి ఉంటే పెద్ద మనసుతో తనను క్షమించాలని కోరారు. కార్యకర్తల నమ్మకం, సహకారం తనకు ఎప్పటికీ ముఖ్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, గత సమావేశంలో జరిగిన విషయాన్ని కొన్ని మాటల ఆధారంగా కాకుండా పూర్తి వీడియో, పూర్తి సందర్భాన్ని పరిగణనలోకి తీసుకుని అర్థం చేసుకోవాలని కోరారు.

 

# Yadagiri