గుంటూరు:అంజుమన్ ఇస్లామియా ఆస్తుల పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని జమీయతుల్ ఉలమా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముఫ్తి బాసిత్ అన్నారు. నల్లచెరువు మదరసాల్లో జమీయతుల్ ఉలమా ఆధ్వర్యంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా ముఫ్తి బాసిత్ మాట్లాడుతూ, అంజుమన్ ఆస్తుల పరిరక్షణ అంశంపై ముస్లిం సంఘాలు, అన్ని రాజకీయ పార్టీల నాయకులతో కలిసి మంగళవారం సాయంత్రం పోత్తూరు వారి తోట రెండవ లైన్లోని మజ్లిసుల్ ఉలమా కార్యాలయంలో కీలక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశానికి ప్రతి ముస్లిం సంఘం నుంచి ఇద్దరు ప్రతినిధులు.
రాజకీయ పార్టీల నుంచి కూడా ఇద్దరు ప్రతినిధులు తప్పనిసరిగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అంజుమన్ ఇస్లామియాకు చెందిన సుమారు 70 ఎకరాలకు పైగా భూమిని స్వాధీనం చేసుకొని పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో, ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని ఆయన పేర్కొన్నారు. అంజుమన్ ఆస్తులు వ్యక్తులవి కాకుండా సమాజానికి చెందినవని, వాటి రక్షణ కోసం అందరూ ఐక్యంగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.
ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు దిశానిర్దేశం చేస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ మంగళవారం సాయంత్రం జరిగే సమావేశానికి తప్పక తరలిరావాలని ముఫ్తి బాసిత్ విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అబ్దుల్ ఖాదర్, హాఫిజ్ ఆతికుర్ రహ్మాన్, అంజుమన్ ఇస్లామియా మాజీ ట్రస్ట్ సభ్యులు పర్వేజ్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తెనాలి పత్తిపాడు నియోజకవర్గ పరిశీలకులు గులాంరసూల్, ముస్లిం సమైక్య వేదిక నాయకులు హాజీ అబ్దుల్ కలాం టిప్పర్ యాసీన్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
