ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు ఈ కీలక బాధ్యతను అప్పగించిన రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రివర్గం మరియు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కృతజ్ఞతలు తెలిపారు.
సమాచార హక్కు చట్టం – 2005 ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టమని పేర్కొన్న ఆయన, ప్రజలకు సమాచారంపై హక్కు కల్పించడం, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడం ఈ చట్టం యొక్క ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
రాష్ట్ర సమాచార కమిషన్ ఒక స్వతంత్ర, నిష్పక్షపాత సంస్థగా పనిచేస్తుందని, చట్టాన్ని మాత్రమే ప్రమాణంగా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సాధారణ పౌరుడు అడిగే సమాచారం చట్టబద్ధంగా ఉంటే, అతనికి అది తప్పకుండా అందేలా చూడటం కమిషన్ బాధ్యత అని పేర్కొన్నారు.
RTI చట్టం అధికారులను భయపెట్టే చట్టం కాదని, పాలనలో విశ్వసనీయతను పెంచే సాధనంగా దీన్ని చూడాలన్నారు. సమాచార అధికారులు చట్టాన్ని సక్రమంగా అమలు చేసేలా అవగాహన కల్పించడంపై కూడా కమిషన్ దృష్టి సారిస్తుందని తెలిపారు.
