ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు. ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు అడ్డంకిగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు.
✅ మంత్రి ధనసరి అనసూయ సీతక్క గారి నేతృత్వంలో ఆదివాసీ, గిరిజన ఎమ్మెల్యేల బృందం ముఖ్యమంత్రి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో కలిసి ఏజెన్సీ ప్రాంతాల సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందజేశారు.
✅ ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, ఆదివాసీలు, గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఏజెన్సీ ప్రాంతాల్లో చెక్ డ్యాంల నిర్మాణంపైన దృష్టి సారిస్తామని వారికి హామీ ఇచ్చారు. వీటి ద్వారా తాగు, సాగునీటి అవసరాలను తీర్చవచ్చునని అన్నారు.
✅ చెక్ డ్యాంలు, రహదారుల నిర్మాణం కోసం అటవీ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. వీలైనంత త్వరగా అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చేలా చూస్తానన్నారు.
✅ ఆదివాసీ, గిరిజన రైతులు సాగు చేస్తున్న భూముల్లో బోర్లు వేయడానికి అనుమతులు ఇవ్వాలని చేసిన విజ్ఞప్తికి ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందించారు. అటవీశాఖ అభ్యంతరాల వల్ల రహదారుల మరమ్మత్తులు ఆలస్యం అవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో కొత్త రహదారులకు అనుమతులు ఇవ్వడం లేదని వారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తెచ్చారు.
✅ ఇలాంటి అంశాలపై వీలైనంత తొందరగా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి గారు అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివాసీ, గిరిజన ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల కోటా పెంచే విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఐటీడీఏలను మరింత బలోపేతం చేసి ఆదివాసీలు, గిరిజనులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు.
✅ ముఖ్యమంత్రి గారిని కలిసిన వారిలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ గారు ఉన్నారు. సమావేశంలో రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి గారు పాల్గొన్నారు.










